లక్నో సూపర్ జెయింట్స్ తిరిగి గెలుపు బాట పట్టింది. వరుసగా ఢిల్లీ క్యాపిటల్స్, కేకేఆర్ చేతిలో ఓటమిపాలైన లక్నో శుక్రవారం సత్తాచాటింది. సొంతమైదానంలో చెన్నై సూపర్ కింగ్స్ను ఎనిమిది వికెట్లతో చిత్తుచేసింది. పాయింట్ల పట్టికలో అయిదో స్థానంలో కొనసాగుతూ ప్లేఆఫ్స్ అవకాశాలు మెరుగుపర్చుకుంది.
విజయంలో లక్నో సారథి కేఎల్ రాహుల్ (82; 53 బంతుల్లో, 9x4, 3x6) కీలకపాత్ర పోషించాడు. కెప్టెన్ ఇన్నింగ్స్ ఆడి జట్టు విజయానికి బాటలు పరిచాడు. తొలుత బ్యాటింగ్ చేసిన సీఎస్కే నిర్ణీత 20 ఓవర్లలో ఆరు వికెట్లు కోల్పోయి 176 పరుగులు చేసింది. రవీంద్ర జడేజా (57*; 40 బంతుల్లో, 5x4, 1x6) టాప్ స్కోరర్. ఆఖర్లో ఎంఎస్ ధోనీ (28; 9 బంతుల్లో, 3x4, 2x6) ధనాధన్ ఇన్నింగ్స్ ఆడాడు.

అనంతరం ఛేదనలో లక్నో సూపర్ జెయింట్స్ 19 ఓవర్లలో రెండు వికెట్లు కోల్పోయి లక్ష్యాన్ని అందుకుంది. రాహుల్తో పాటు క్వింటన్ డికాక్ (54; 43 బంతుల్లో, 5x4, 1x6) ఆకట్టుకున్నాడు. వీరిద్దరు తొలి వికెట్కు 15 ఓవర్లలో 134 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. లక్నో తరఫున ఏ వికెట్కైనా ఇది రెండో అత్యుత్తమ భాగస్వామ్యం. 2022లో కేకేఆర్పై రాహుల్-డికాక్ సాధించిన 210 పరుగుల భాగస్వామ్యం రికార్డుల్లో టాప్లో ఉంది.
ఇక సీఎస్కేపై తొలి వికెట్కు ఇది మూడో అత్యుత్తమ భాగస్వామ్యం. అజింక్య రహానె-షేన్ వాట్సన్ (రాజస్థాన్ రాయల్స్, 144 పరుగులు), శిఖర్ ధావన్-పృథ్వీ షా (ఢిల్లీ క్యాపిటల్స్, 138 పరుగులు) టాప్-2లో ఉన్నాయి. కాగా, నిన్న జరిగిన సీఎస్కే మ్యాచ్లో అర్ధశతకం సాధించిన కేఎల్ రాహుల్ అరుదైన రికార్డు సాధించాడు. ఐపీఎల్లో 50+ స్కోరును అత్యధిక సార్లు చేసిన వికెట్కీపర్గా రాహుల్ చరిత్రకెక్కాడు.
ఐపీఎల్లో 50+ స్కోరును రాహుల్ 25 సార్లు సాధించాడు. అంతకుముందు ఈ రికార్డు ఎంఎస్ ధోనీ పేరిట ఉండేది. ధోనీ 24 హాఫ్సెంచరీలు బాదాడు. రాహుల్, ధోనీ తర్వాతి స్థానాల్లో డికాక్ (23), దినేశ్ కార్తీక్ (21), రాబిన్ ఊతప్ప (18) ఉన్నారు.