
కుల్దీప్ మాయ..
ఈ టెస్టులో అద్భుతంగా రాణించిన ఆటగాళ్లలో కుల్దీప్ యాదవ్ ఒకడు. మొదటి ఇన్నింగ్స్లో భారత జట్టు కష్టాల్లో ఉన్నప్పుడు రవిచంద్రన్ అశ్విన్తో కలిసి అద్భుతమైన భాగస్వామ్యం నెలకొల్పాడు. ఆ తర్వాత బౌలింగ్లోనూ సత్తా చాటి ఐదు వికెట్లు తీసుకున్నాడు. పునరాగమనంలో అతను ఆడుతున్న మొదటి టెస్టు మ్యాచ్ ఇదే కావడం గమనార్హం.
ఇక రెండో ఇన్నింగ్స్లో కూడా కుల్దీప్ మాయ చేస్తాడని అంతా అనుకున్నారు. కానీ అతనికి అంతగా బౌలింగ్ చేసే అవకాశం ఇవ్వలేదు. అయితే వేసిన కొద్ది ఓవర్లలోనే ఒక వికెట్ తీసుకున్నాడు. ఆ తర్వాత ఐదో రోజు ఆట మొదలైన తర్వాత టకటకా మరో రెండు వికెట్లు తీసుకొని ఆట ముగించాడు. అతనికే 'ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్' అవార్డు దక్కింది.

అప్పుడు కొంత ఆందోళన చెందా: రాహుల్
తాము ఇక్కడ కొన్ని రోజులుగా ఉంటున్నామని, వన్డే సిరీస్ తాము అనుకున్నట్లు సాగలేదని కేఎల్ రాహుల్ అన్నాడు. ఈ విజయం సాధించినందుకు చాలా సంతోషంగా ఉందన్నాడు. పిచ్ తొలి రెండ్రోజులు బ్యాటింగ్కు కష్టంగా ఉందని, పరుగులు చేయడం చాలా కష్టంగా కనిపించిందని చెప్పాడు. అయితే తర్వాత్తర్వాత పిచ్ ఫ్లాట్గా మారిందని వివరించాడు. దీంతో కొంత ఆందోళన కలిగిందన్నాడు.
ఇలాంటి సమయంలో లోయర్ ఆర్డర్ కంట్రిబ్యూషన్స్ చాలా ముఖ్యమన్నాడు. అలాగే రెండో ఇన్నింగ్స్లో పుజారా, శుభ్మన్ గిల్ ఇద్దరూ తమకు దక్కిన అవకాశాలను చక్కగా ఉపయోగించుకున్నారని తెలిపాడు. తమ బౌలింగ్ ఎటాక్ బలంగానే ఉందని స్పష్టం చేశాడు.

ఐదో రోజు ఒక్క సెషన్ కూడా లేదు..
ఓవర్ నైట్ స్కోరు 272/6తో ఐదో రోజు ఆట ప్రారంభించిన బంగ్లాదేశ్ ఎక్కువ సేపు ఆడలేకపోయింది. ఆట మొదలైన కాసేపటికే మెహదీ హసన్ (13)ను సిరాజ్ అవుట్ చేశాడు. దీంతో బంగ్లాదేశ్ ఓటమి ఖరారైంది. కుల్దీప్ యాదవ్ రంగంలోకి దిగి షకీబల్ హసన్ (84)ను అవుట్ చేశాడు. ఆ మరుసటి ఓవర్లోనే మరో వికెట్ తీసుకున్న కుల్దీప్.. ఎబాదత్ హుస్సేన్ (0)ను డకౌట్గా పెవిలియన్ పంపాడు.
తైజుల్ ఇస్లాం (4)ను అక్షర్ అవుట్ చేయడంతో బంగ్లా ఆలౌట్ అయిపోయింది. 513 పరుగుల లక్ష్యంతో బరిలో దిగిన బంగ్లాదేశ్.. 324 పరుగులు మాత్రమే చేయగలిగింది. దీంతో భారత జట్టు 188 పరుగుల తేడాతో భారీ విజయం నమోదు చేసింది. వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్ చేరాలంటే రెండో టెస్టులో కూడా భారత్ నెగ్గి తీరాలన్న సంగతి తెలిసిందే.


Click it and Unblock the Notifications
