
హైదరాబాద్: కటక్లో బుధవారం శ్రీలంకతో జరిగిన మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్ మాట్లాడుతూ.. 'ధోనీ ఫామ్ గురించి ఆందోళన ఎందుకు చెందుతున్నారో నాకు అర్థం కావడంలేదు. ఎప్పటి నుంచో అతను బాగా ఆడుతున్నాడు. ధోనీ బుధవారం టీ 20లో తన బ్యాటింగ్ ప్రదర్శనతో నన్నెక్కడ చంపేస్తాడో అని నాకు చాలా భయమేసింది. అలాంటి ప్రదర్శన ధోనీ మాత్రమే ఎలా చేయగలుగుతున్నాడో తెలియడం లేదు. టీవీలో చూసినప్పుడు, కలిసి ఆడుతున్నప్పుడు ధోనీ పరుగులు చేస్తూనే ఉన్నాడు. గతంలో ఇంగ్లాండ్పై ఇదే మైదానంలో శతకం సాధించాడు. ప్రతి మ్యాచ్లోనూ అతడు అద్భుతంగా రాణిస్తున్నాడు' అని రాహుల్ అన్నాడు.
భారత క్రికెట్ జట్టు మాజీ సారథి మహేంద్ర సింగ్ ధోనీపై సహచర ఆటగాడు కేఎల్ రాహుల్ ప్రశంసల వర్షం కురిపించాడు. 'ధోని ఎప్పటికీ మ్యాచ్ విన్నరే, తన స్థానాన్ని ఎవరూ భర్తీ చేయలేరు, అతనొక్కడే' అని రాహుల్ అన్నాడు. ధోనీ ఫామ్ గురించి మాట్లాడుతున్న వారి వ్యాఖ్యలను రాహుల్ తిప్పికొట్టాడు. గతంలో పలువురు మాజీ క్రికెటర్లు ధోనీ టీ20 క్రికెట్ నుంచి తప్పుకుని యువ ఆటగాళ్లకు చోటు కల్పించాలని వ్యాఖ్యానించిన సంగతి తెలిసిందే.
తాజాగా కటక్లో శ్రీలంకతో జరిగిన మ్యాచ్లో ధోనీ 22 బంతుల్లో 39 పరుగులతో నాటౌట్గా నిలిచాడు. డెత్ ఓవర్లలో వికెట్ల మధ్య చిరుతలా పరుగులు తీస్తూ ధోనీ స్కోరు బోర్డును ఉరకలెత్తించాడు. దీంతో భారత జట్టు నిర్ణీత ఓవర్లలో 180 పరుగులు చేసింది. అనంతరం బ్యాటింగ్కు దిగిన లంక తడబడింది. 16 ఓవర్లలో 87 పరుగులకే కుప్పకూలింది. ఇరు జట్ల మధ్య రెండో టీ20 శుక్రవారం ఇండోర్లో జరగనుంది.
ధోనీకి సాటి ఎవ్వరూ లేరు.. రారు.
ధోనీ.. మ్యాచ్ విన్నర్. మేమంతా అతనిలా ఉండాలనుకుంటాం. మిడిలార్డర్లో వచ్చి మ్యాచ్ను చక్కదిద్దడం అంత సులువేం కాదు. మ్యాచ్పై పట్టు సాధించి ముందుకు తీసుకెళ్లాలి. అలాగే జట్టును విజయం వైపు తీసుకెళ్లేందుకు మంచి స్ట్రైక్రేట్తో ఆడాలి. ఇది చాలా కష్టం. కానీ, ధోనీ మాత్రం ఇవన్నీ ఎంతో సులువుగా చేస్తాడు అని రాహుల్ అన్నాడు. ఆటగాళ్లు తమకు అందివచ్చిన అవకాశాలను సద్వినియోగం చేసుకోవాలి. జట్టులో స్థానం కోసం పోటీ నెలకొన్నప్పుడు ప్రతి ఇన్నింగ్స్లో వారు నిరూపించుకోగలగాలి. అందులో భాగంగానే ఈ రోజు నేను నా అత్యుత్తమ ప్రదర్శన చేయగలిగానని రాహుల్ తెలిపాడు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.