తొలి మూడు మ్యాచుల్లో విఫలం..
ఈ టీ20 ప్రపంచకప్లో అద్భుతంగా రాణిస్తాడని అనుకున్న స్టార్ ఓపెనర్ కేఎల్ రాహుల్.. అభిమానులను దారుణంగా నిరాశ పరిచాడు. పాకిస్తాన్పై కేవలం 4 పరుగులే చేసిన అతను.. నెదర్లాండ్స్, సౌతాఫ్రికాపై కూడా విఫలమయ్యాడు. దీంతో అతనిపై అభిమానులు, మాజీలు అసంతృప్తి వ్యక్తం చేశారు. అసలు రాహుల్ను తప్పించి సూర్యకుమార్ యాదవ్ చేత ఓపెనింగ్ చేయించాలని, అతనైతే ఇన్నింగ్స్కు ఒక టోన్ సెట్ చేయగలడని అన్నారు.
బంగ్లాపై దుమ్మురేపిన రాహుల్..
జట్టులో తన స్థానంపై వస్తున్న విమర్శలను రాహుల్ ఏమాత్రం పట్టించుకోలేదు. తన ఆటతీరుతోనే విమర్శకులకు సమాధానం చెప్పాడు. బంగ్లాదేశ్పై చెలరేగిన అతను హాఫ్ సెంచరీతో అదరగొట్టాడు. దీంతో అతను కూడా ఫామ్ అందుకున్నాడని అంతా సంతోషించారు. అదే సమయంలో ఈ మ్యాచ్ ముందు ఫామ్లో ఉన్న కోహ్లీతో రాహుల్ మాట్లాడుతూ కనిపించాడు. నెట్ ప్రాక్టీస్ సందర్భంగా కోహ్లీతో మాట్లాడిన రాహుల్.. సుదీర్ఘ చర్చ జరిపాడు.
ఏం మాట్లాడుకున్నారు?
ఈ క్రమంలో బంగ్లాతో మ్యాచ్ అనంతరం మీడియా సమావేశంలో పాల్గొన్న రాహుల్ను విలేకరులు ఇదే విషయంపై ప్రశ్నించారు. అసలు కోహ్లీతో ఏం మాట్లాడారు? అని అడిగారు. దీనికి బదులిచ్చిన రాహుల్.. 'ఇంతకుముందు ఆస్ట్రేలియాలో ఆడినప్పటికీ, ఇప్పటికీ పరిస్థితులు ఎంతలా మారిపోయాయో మాట్లాడుకున్నాం. మిడిల్ ఓవర్లలో ఏం చెయ్యాలి? మైండ్ సెట్ ఎలా ఉండాలి? అనే విషయాలు చర్చించాం' అని చెప్పాడు. 'గత మ్యాచుల్లో కోహ్లీ అద్భుతంగా ఆడాడు. నేను కూడా అసలు అతని ఆలోచనా విధానం ఎలా ఉందో తెలుసుకోవాలని అనుకున్నా. దాని గురించే మాట్లాడా' అని వివరించాడు.