
ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2022లో హెర్నియా బారిన పడ్డ భారత జట్టు వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ కోలుకున్న సంగతి తెలిసిందే. ఇక రాహుల్ తాజాగా బెంగళూరులోని శిక్షణ మైదానానికి వచ్చాడు. నేషనల్ క్రికెట్ అకాడమీలో తన తర్ఫీదు ప్రారంభించాడు. జిమ్లో చెమటోడ్చుతున్నాడు. అలాగే వార్మప్ ఎక్సర్ సైజులు చేశాడు. ఇక తాను నేషనల్ క్రికెట్ అకాడమీలో మళ్లీ శిక్షణ పొందుతూ.. తిరిగి జట్టులోకి రావడానికి సిద్ధమవుతున్నానని చెప్పడానికి బెంగళూరులోని ఎం.చిన్నస్వామి స్టేడియంలో తాను వార్మప్ చేస్తున్న వీడియోను అతను ఇన్స్టాలో షేర్ చేశాడు.
ఆ వీడియోలో తన జిమ్ వర్కవుట్లను కూడా ప్రదర్శించాడు. కమ్ బ్యాక్ స్ట్రాంగర్ అంటూ క్యాప్షన్ కూడా ఇచ్చాడు. రాహుల్ ఇంతకుముందు నెట్స్లో బ్యాటింగ్ ప్రాక్టీస్ చేస్తున్న వీడియో ఒకటి బయటికొచ్చిన సంగతి తెలిసిందే. ఆ వీడియో సోషల్ మీడియాలో బాగా వైరలైంది. నేషనల్ క్రికెట్ అకాడమీలో శిక్షణ పొందుతున్న భారత మహిళా క్రికెట్ టీం సీనియర్ పేసర్ ఝులన్ గోస్వామి బౌలింగ్లో రాహుల్ బ్యాటింగ్ ప్రాక్టీసు చేసినట్లు ఆ వీడియోలో కన్పించింది.
వెస్టిండీస్తో జులై 29నుండి ఆగస్టు 7వరకు జరగనున్న 5 మ్యాచ్ల టీ20 సిరీస్కు కేఎల్ రాహుల్ ఎంపికయ్యాడు. అయితే రాహుల్ NCAలో తప్పనిసరిగా ఫిట్నెస్ పరీక్షల్లో పాస్ అయితేనే అతన్ని జట్టుకు ఎంపిక చేస్తారు. లక్నో సూపర్ జెయింట్స్ జట్టుకు ఐపీఎల్లో కెప్టెన్సీ వహించిన రాహుల్.. ఐపీఎల్ అనంతరం గాయపడ్డంతో జర్మనీలో హెర్నియా కోసం శస్త్రచికిత్స తీసుకున్నాడు.
దక్షిణాఫ్రికాతో 5మ్యాచ్ల టీ20 సిరీస్కు కెప్టెన్గా ఎంపికైనప్పటికీ.. గాయం వల్ల దూరమయ్యాడు. అతని గైర్హాజరీలో రిషబ్ పంత్ కెప్టెన్సీ బాధ్యతలు చేపట్టాడు. ఇక హార్దిక్ పాండ్యా ఐర్లాండ్లో భారత టీ20 జట్టుకు నాయకత్వం వహించిన సంగతి తెలిసిందే. ఇకపోతే జులై 22నుంచి ట్రినిడాడ్లో జరిగే మూడు వన్డేల సిరీస్తో భారత వెస్టిండీస్ పర్యటన ప్రారంభం అవుతుంది.