
ఆ రికార్డును నేనే బద్దలుకొడతా:
సోషల్ మీడియాలో చాట్ షో సందర్భంగా తన జీవితం, కెరీర్ మరియు ఇతర అంశాల గురించి అభిమానులు ప్రశ్నలు అడగ్గా.. కేఎల్ రాహుల్ తనదైన శైలిలో స్పందించాడు. టీ20ల్లో యువరాజ్ సింగ్ నెలకొల్పిన వేగవంతమైన అర్ధ సెంచరీ రికార్డును బద్దలు కొట్టే బ్యాట్స్మన్ ఎవరైనా ఉన్నారా? అని ఓ అభిమాని అడగ్గా.. యువీ రికార్డును బద్దలు కొట్టే క్రికెటర్ నేనే అని రాహుల్ సమాధానం ఇచ్చాడు.

టీ20 ఫార్మాట్లో వేగవంతమైన అర్ధ సెంచరీ:
2007 టీ20 ప్రపంచకప్లో యువరాజ్ సింగ్ టీ20 ఫార్మాట్లో వేగవంతమైన అర్ధ సెంచరీ నమోదు చేశాడు. గత 13 ఏళ్లుగా ఈ రికార్డు యువీ పేరిటే ఉంది. దక్షిణాఫ్రికాలోని డర్బన్ వేదికగా ఇంగ్లండ్తో జరిగిన ఈ మ్యాచ్లో 16 బంతుల్లోనే 56 పరుగులు చేశాడు. ఇందులో 7 సిక్సర్లు, 3 ఫోర్లు ఉన్నాయి. ఈ ఇన్నింగ్స్లోనే యువీ ఆరు బంతుల్లో ఆరు సిక్సర్లు బాదాడు. క్రిస్ గేల్, రసెల్ లాంటి ఆటగాళ్లు యువీ రికార్డికి దగ్గరగా వచ్చినా.. అందుకోలేకపోయారు.

14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ:
ఐపీఎల్లో కింగ్స్ లెవన్ పంజాబ్ తరపున బరిలోకి దిగిన లోకేష్ రాహుల్.. 14 బంతుల్లోనే హాఫ్ సెంచరీ నమోదు చేశాడు. ఆ మ్యాచ్లో రాహుల్ వీరవిహారం చేసాడు. యువీ రికార్డుకు చేరువగా వచ్చాడు. ఈ ధీమాతోనే యువీ రికార్డును తానే బద్దలు కొడతా అని ధీమా వ్యక్తం చేసాడు. మరోవైపు రాహుల్ ఈ ఏడాది పంజాబ్ జట్టుకు సారథిగా కూడా వ్యవహరించనున్నాడు. ఇక టీమిండియా వైట్బాల్ క్రికెట్ జట్టులో వికెట్ కీపర్ బ్యాట్సమన్గా వ్యవహరిస్తున్న రాహుల్.. గతేడాది నుంచి సూపర్ ఫామ్లో ఉన్నాడు. టీ20 ప్రపంచకప్కు కూడా కీపర్గా ఎంపికయ్యే అవకాశాలు మెండుగా ఉన్నాయి.

కీపర్ రేసులో ధోనీ, రాహుల్, పంత్:
ఆస్ట్రేలియా వేదికగా అక్టోబరులో టీ20 ప్రపంచకప్ జరగనుండగా.. కీపర్ రేసులో లోకేష్ రాహుల్, రిషబ్ పంత్ ముందు వరుసలో ఉన్నారు. ఐపీఎల్ 2020 సీజన్ జరిగి.. ఎంఎస్ ధోనీ ఫామ్ నిరూపించుకోగలిగితే అతడు కూడా ఈ రేసులోకి వచ్చే అవకాశం ఉంది. కానీ.. మహమ్మారి కరోనా వైరస్ కారణంగా మార్చి 29 నుంచి ప్రారంభంకావాల్సిన ఐపీఎల్ 2020 సీజన్ నిరవధిక వాయిదా పడింది. ఇప్పటికీ వైరస్ పరిస్థితులు అదుపులోకి రాకపోవడంతో టోర్నీ జరగడంపై సందిగ్ధత నెలకొంది.


Click it and Unblock the Notifications












