హైదరాబాద్: ఆస్ట్రేలియాతో ముగిసిన రెండు టీ20ల సిరిస్లో భారత యువ ఆటగాడు కేఎల్ రాహుల్ మళ్లీ ఫామ్లోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఐసీసీ తాజాగా ప్రకటించిన టీ20 బ్యాట్స్మెన్ ర్యాంకింగ్స్లో టాప్-10లో చోటు దక్కించుకున్నాడు. ఆసీస్పై రెండు టీ20ల్లో కలిపి 97 పరుగులు చేసిన రాహుల్ నాలుగు స్థానాలు ఎగబాకి ఆరో స్థానానికి చేరుకున్నాడు.
మూడో వన్డేలో ఇంగ్లాండ్ విజయం: 2-1తో సిరిస్ భారత్ వశం
రాహుల్ మినహా టాప్-10లో ఒక్క భారత బ్యాట్స్మెన్ కూడా లేరు. రోహిత్ శర్మ 12వ స్థానంలో ఉండగా.. శిఖర్ ధావన్ 15వ స్థానంలో, కోహ్లీ 17వ స్థానంలో ఉన్నారు. మరోవైపు ధోని ఏడు స్థానాలు ఎగబాకి 56వ స్థానానికి చేరుకున్నాడు. ఐర్లాండ్తో మ్యాచ్లో సెంచరీ నమోదు చేసిన ఆఫ్ఘాన్ బ్యాట్స్మన్ హజ్రతుల్లా జజాయ్ ఏకంగా 31 స్థానాలు ఎగబాకి ఏడో ర్యాంక్లో నిలిచాడు.
ఇక, బౌలర్ల జాబితాలో 12 స్థానాలు మెరుగుపరుచుకున్న బుమ్రా 15వ ర్యాంకులో నిలవగా.. లెఫ్టార్మ్ స్పిన్నర్ కృనాల్ పాండ్యా 18 స్థానాలు మెరుగుపరుచుకుని కెరీర్లో ఉత్తమంగా 43వ ర్యాంకు సాధించాడు. కుల్దీప్ యాదవ్ రెండు స్థానాలు దిగజారి 4వ ర్యాంకుకు చేరాడు. భారత్తో జరిగిన రెండు టీ20ల సిరిస్లో సెంచరీ మెరిసిన మ్యాక్స్వెల్ టీ20 ర్యాంకింగ్స్లో రెండో స్థానానికి చేరుకున్నాడు.
ఆస్ట్రేలియా తరఫున డార్సీ షార్ట్ 8 స్థానాలు ఎగబాకి ఎనిమిదో ర్యాంక్కి చేరుకున్నాడు. జట్ల ర్యాంకింగ్స్ విషయానికి వస్తే ఆస్ట్రేలియాతో సిరీస్ కోల్పోయినప్పటికీ టీమ్ విభాగంలో భారత్ రెండో స్థానంలోనే కొనసాగుతోంది. పాకిస్థాన్ అగ్రస్థానంలో, భారత్ రెండో స్థానంలో నిలిచాయి. ఆస్టేలియా మూడోస్థానానికి ఎగబాకింది.