
ముంబై: ఇంటర్నేషనల్ క్రికెట్ కౌన్సిల్.. కొద్దిసేపటి కిందటే టీ20 ర్యాంకులను ప్రకటించింది. బ్యాటింగ్, బౌలింగ్, ఆల్రౌండర్ విభాగాల్లో సత్తా చాటిన ప్లేయర్లకు ర్యాంకులను ఖరారు చేసింది. ఈ ర్యాంకులను బట్టి చూస్తోంటే- టీ20లపై భారత ప్లేయర్ల హవా కాస్త తగ్గుముఖం పట్టినట్టే కనిపిస్తోంది. ఎందుకంటే- టాప్ 10లో ఒకే ఒక్క టీమిండియా ప్లేయర్కు చోటు దక్కింది. అది కూడా పదో స్థానంతో సరిపెట్టుకోవాల్సి వచ్చింది. బౌలింగ్, ఆల్రౌండర్ కేటగిరీల్లో భారత ఆటగాళ్ల పేర్లు వెతికినా కనిపించట్లేదు.
టీ20 మ్యాచ్లల్లో రాణించిన ప్లేయర్ల పేర్లతో కూడిన జాబితాను ఐసీసీ కొద్దిసేపటి కిందటే ప్రకటించింది. దీన్ని తన అధికారిక వెబ్సైట్లో పొందుపరిచింది. బ్యాటింగ్ కేటగిరీలో పాకిస్తాన్ కేప్టెన్ ప్లస్ ఓపెనర్ బాబర్ ఆజమ్ 818 పాయింట్లతో అగ్రస్థానాన్ని ఆక్రమించాడు. రెండో స్థానంలో దక్షిణాఫ్రికా క్రికెటర్ ఎయిడెన్ మార్క్రమ్-796, అతని తరువాత పాకిస్తాన్ ఓపెనర్ మహ్మద్ రిజ్వాన్-794 నిలిచారు. తొలి మూడు స్థానాలను పాకిస్తాన్ కైవసం చేసుకుంది.
నాలుగు, అయిదు స్థానాల్లో ఇంగ్లాండ్, న్యూజిలాండ్ ఆటగాళ్లు డేవిడ్ మలన్-728, డెవాన్ కాన్వే-703 ఉన్నారు. ఈ ఇద్దరి తరువాత ఆస్ట్రేలియన్ ఆరోన్ ఫించ్-692, దక్షిణాఫ్రికన్ రస్సీ వాన్డెర్ డుస్సెన్-669, న్యూజిలాండ్ ఓపెనర్ మార్టిన్ గప్టిల్-658, శ్రీలంక ప్లేయర్ పాథుమ్ నిశ్శంక-654 ఉన్నారు. టీమిండియా ఆటగాడు కేఎల్ రాహుల్ 10వ స్థానాన్ని దక్కించుకున్నాడు. అతనికి లభించిన పాయింట్లు 646. 633 పాయింట్లతో రోహిత్ శర్మ 14వ స్థానంలో నిలిచాడు. విరాట్ కోహ్లీ, శ్రేయాస్ అయ్యర్ 16,19వ స్థానాల్లో ఉన్నారు.
బౌలింగ్ కేటగిరీలో భారత ఆటగాళ్లెవరికీ చోటు దక్కలేదు. ఈ విభాగంలో దక్షిణాఫ్రికాకు చెందిన తబ్రేజ్ శాంసీ 784 పాయింట్లతో అగ్రస్థానంలో ఉన్నాడు. ఆదిల్ రషీద్, జోష్ హేజిల్వుడ్, ఆడమ్ జంపా, రషీద్ ఖాన్, వనిందు హసరంగ, ఎన్రిచ్ నోర్ట్జె, ముజీబుర్ రెహ్మాన్, నాసుమ్ అహ్మద్, షహీన్ అఫ్రిది టాప్ 10లో చోటు దక్కించుకున్నారు. టీమిండియా బౌలర్ భువనేశ్వర్ కుమార్ మాత్రమే తొలి 20 మందిలో నిలిచాడు. అతని స్థానం 18. 586 పాయింట్లతో 18వ స్థానంలో ఉన్నాడు.
ఆల్రౌండర్ విభాగంలోనూ ఇదే పరిస్థితి నెలకొంది. టీమిండియా ప్లేయర్లకు చోటు దక్కలేదు. ఈ విభాగంలో ఆఫ్ఘనిస్తాన్కు చెందిన మహ్మద్ నబీ టాప్ పొజీషన్ను ఆక్రమించుకున్నాడు. షకీబుల్ హసన్, మొయిన్ అలీ, జేజే స్మిత్, లియామ్ లివింగ్స్టొన్, రోహన్ ముస్తపా, గ్లెన్ మ్యాక్స్వెల్, జీషాన్ మక్సూద్, ఎయిడెన్ మార్క్రమ్, దీపేంద్ర అరి ఉన్నారు. ఆ తరువాత కూడా టీమిండియా ప్లేయర్లకు చోటు లభించలేదు. టాప్ 20లోనూ లేరు.