బంగ్లాతో రెండో వన్డే రెండో ఓవర్లోనే రోహిత్కు గాయమైంది. స్లిప్స్లో క్యాచ్ అందుకోబోయిన సమయంలో అతని బొటనవేలికి గాయమైంది. దీంతో అతను మైదానం వీడాల్సి వచ్చింది. ఈ సమయంలో వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్.. జట్టుకు నాయకత్వం వహించాడు. చాలా కాలం గ్యాప్ తర్వాత ఈ సిరీస్లో వికెట్ కీపింగ్ చేస్తున్న రాహుల్.. అదనంగా కెప్టెన్సీ చేయడంతో ఒత్తిడికి గురై ఉండొచ్చని మాజీ క్రికెటర్ వసీం జాఫర్ అన్నాడు. అంతేకాదు, కేఎల్ రాహుల్ వద్ద కెప్టెన్సీ అనుభవం కూడా అంతగా లేదని, ముఖ్యంగా అంతర్జాతీయ స్థాయిలో అసలు లేదని జాఫర్ చెప్పాడు.
రోహిత్ నిష్క్రమణ తర్వాత కాసేపటి వరకు రాహుల్ బాగానే కెప్టెన్సీ చేసినట్లు కనిపించింది. బంగ్లాను 69/6కు కట్టడి చేశారు. అక్కడి నుంచి మెహదీ హసన్, మహ్మదుల్లా భారత్కు అవకాశం ఇవ్వలేదు. ఇక్కడే రాహుల్ అనుభవలేమి బయట పడిందన్న జాఫర్.. ఈ సమయంలో రోహిత్ మైదానంలో ఉంటే కథ వేరేలా ఉండేదన్నాడు. అదే సమయంలో బంగ్లా బ్యాటర్లు కూడా అద్భుతంగా ఆడారని, భారత్కు ఏమాత్రం అవకాశం ఇవ్వలేదని అన్నాడు. ఆ తర్వాత ఛేజింగ్లో కూడా రాహుల్ పెద్దగా రాణించలేదు. స్వల్ప స్కోరుకే పెవిలియన్ చేరాడు. దీంతో కొందరు ఫ్యాన్స్ కూడా రాహుల్ కెప్టెన్సీ వల్లనే టీమిండియా ఓడిందని అంటున్నారు.