హైదరాబాద్: మూడు టెస్టు మ్యాచ్ల సిరిస్లో భాగంగా సెంచూరియన్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరిగే రెండో టెస్టులో బరిలోకి దిగేందుకు కేఎల్ రాహుల్కు మార్గం సుగమం అయింది. కేప్ టౌన్ వేదికగా జరిగిన తొలి టెస్టులో రాహుల్ స్ధానంలో ఓపెనర్గా చోటు దక్కించుకున్న శిఖర్ ధావన్ విఫలం కావడం సర్వత్రా విమర్శలకు తావిచ్చిన సంగతి తెలిసిందే.
ఈ నేపథ్యంలో విదేశీ గడ్డపై మంచి బ్యాటింగ్ రికార్డుని కలిగి ఉన్న కేఎల్ రాహుల్ని కాదని అతడి స్ధానంలో ధావన్కు చోటు కల్పించడంపై జట్టు మేనేజ్మెంట్పై క్రీడా విశ్లేషకులు పెద్ద ఎత్తున విమర్శలు గుప్పించారు. దీంతో సెంచూరియన్ టెస్టులో ఓపెనర్గా ధావన్ స్ధానంలో కేఎల్ రాహుల్ బరిలోకి దిగనున్నాడు.
కేప్ టౌన్ టెస్టు రెండు ఇన్నింగ్స్లో బౌలర్లు చక్కటి ప్రదర్శన చేసినప్పటికీ, బ్యాట్స్మెన్ విఫలం కావడంతో దక్షిణాఫ్రికా చేతిలో టీమిండియా 72 పరుగుల తేడాతో ఓటమి పాలైన సంగతి తెలిసిందే. ఇండియా టుడేకి ఇచ్చిన ఇంటర్యూలో టీమిండియా మాజీ క్రికెటర్ సౌరవ్ గంగూలీ సైతం తొలి టెస్టులో తుది జట్టు ఎంపికపై అసంతృప్తిని వ్యక్తం చేశాడు.
"విదేశీ గడ్డపై రోహిత్ శర్మ, శిఖర్ ధావన్ల రికార్డు ఏమంత మెరుగ్గా లేదు. వాళ్లు రికార్డులను చూస్తే అదే అర్ధం అవుతుంది. దీంతో తొలి టెస్టులో మురళీ విజయ్, విరాట్ కోహ్లీలపైనే జట్టు ఆధారపడింది. పుజారాను చూడండి. తాను సాధించిన 14 టెస్టు సెంచరీల్లో 13 సెంచరీలు ఉపఖండం పిచ్లపై చేసినవే" అని గంగూలీ వివరించాడు.
"నేను ప్రత్యేకించి కేఎల్ రాహుల్ గురించి ఎందుకు చెప్తున్నానంటే అతడు ఆస్ట్రేలియా, వెస్టిండిస్, శ్రీలంక పిచ్లపై పరుగులు నమోదు చేశాడు. ఇదే ఫామ్కు సంబంధించిన అంశం మాత్రమే కాదు. ఆటగాళ్లు ఎక్కడ పరుగులు చేయగలుగుతారే తెలుసుకోవడం ముఖ్యం. అయితే దీనిపై కంగారు పడాల్సిన అవసరం లేదు. తొలి టెస్టు ఫలితం నాకు ఆశ్చర్యాన్ని కలిగించలేదు. రెండో గేమ్లో భారత జట్టు తిరిగి తప్పక పుంజుకుంటుంది'' అని దాదా ఆశాభావం వ్యక్తం చేశాడు.
సెంచూరియన్ టెస్టులో జట్టు మేనేజ్మెంట్ ధావన్ స్ధానంలో కేఎల్ రాహుల్కు రోహిత్ శర్మ స్ధానంలో రహానేతో బరిలోకి దిగాలని గంగూలీ సూచించాడు. అయితే, రెండో టెస్టులో ఇప్పటికే మురళీ విజయ్తో కలిసి కేఎల్ రాహుల్ ఓపెనింగ్ భాగస్వామ్యం చేస్తాడని వార్తలు వస్తున్నప్పటికీ, రహానే విషయంలోనే స్పష్టత లేదు.
తెలుగులో అన్ని క్రీడావార్తల కోసం 'మై-ఖేల్ తెలుగు'ను ఫేస్బుక్, ట్విటర్ , గూగుల్ ప్లస్లో ఫాలో అవ్వండి.