
హైదరాబాద్: టీమిండియా ఓపెనర్ కేఎల్ రాహుల్ ఐసీసీ టీ20 ర్యాంకింగ్స్లో తన కెరీర్ అత్యుత్తమ ర్యాంకుని అందుకున్నాడు. సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకింగ్స్లో కేఎల్ రాహుల్ రెండో స్థానంలో నిలిచాడు. ప్రస్తుతం న్యూజిలాండ్ పర్యటనలో ఉన్న కేఎల్ రాహుల్ ఐదు టీ20ల సిరిస్లో రెండు హాఫ్ సెంచరీలతో 224 పరుగులు చేశాడు.
ఫలితంగా కేఎల్ రాహుల్ తన కెరీర్లోనే అత్యుత్తమ ర్యాంకుని సాధించాడు. ఇక, టీమిండియా కెప్టెన్ విరాట్ కోహ్లీ తొమ్మిదో స్థానంలో నిలవగా... మరో ఓపెనర్ రోహిత్ శర్మ మూడు స్థానాలు ఎగబాకి పదో స్థానంలో నిలిచాడు. దీంతో టాప్-10లో భారత్ నుంచి ముగ్గురు ఆటగాళ్లకు చోటు దక్కింది.
రోహిత్ శర్మతో పాటు భారత బ్యాట్స్ మెన్లలో శ్రేయాస్ అయ్యర్ 63 స్థానాలు ఎగబాకి 55వ స్థానంలో నిలవగా, మనీష్ పాండే 12 స్థానాలు ఎగబాకి 58వ స్థానంలో కొనసాగుతున్నాడు. ఇక, ఈ జాబితాలో పాకిస్థాన్ క్రికెటర్ బాబర్ అజామ్ తన అగ్రస్థానాన్ని మరోసారి నిలబెట్టుకున్నాడు.
ఇక, కివీస్ విషయానికొస్తే బ్యాటింగ్ విభాగంలో కేన్ విలియమ్సన్ (16), టిమ్ సీఫర్ట్(34), రాస్ టేలర్(39)లు తమ ర్యాంకులను మరింతగా మెరుగుపరచుకున్నారు. బౌలర్ల విషయానికి వస్తే న్యూజిలాండ్తో జరిగిన ఆఖరి టీ20లో మూడు వికెట్లు తీసిన బుమ్రా 26 స్థానాలను ఎగబాకి 11వ స్థానంలో నిలిచాడు.
చైనామన్ స్పిన్నర్ యజువేంద్ర చాహల్ 10 స్థానాలు ఎగబాకి 30వ స్థానంలో నిలవగా... ఈ సిరిస్లో ఎనిమిది వికెట్లు తీసిన పేసర్ శార్ధూల్ ఠాకూర్ 34 స్థానాలు ఎగబాకి 57వ స్థానంలో నిలిచాడు. ఈ సిరిస్లో రెండు సూపర్ ఓవర్లు వేసిన కివీస్ పేసర్ టిమ్ సౌథీ 13వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు.
ఐదు టీ20ల సిరీస్ను టీమిండియా క్లీన్ స్వీప్ చేయడంతో టీమ్ ర్యాంకింగ్స్లో తన ర్యాంకుని మెరుగుపరచుకుంది. ప్రస్తుతం టీమిండియా 265 రేటింగ్ పాయింట్లతో టీమ్ ర్యాంకింగ్స్లో నాలుగో స్థానంలో నిలిచింది. ఈ జాబితాలో దాయాది దేశమైన పాకిస్థాన్ 270 పాయింట్లతో అగ్రస్థానంలో కొనసాగుతోంది.