హైదరాబాద్: గతంలో ఎన్ని సెంచరీలు చేసినా.. మంగళవారం ఇంగ్లాండ్తో ఆడిన టీ20 సెంచరీ ప్రత్యేకమైపోయింది రాహుల్కి. ఈ విషయాన్ని అతనే స్వయంగా చెప్పుకున్నాడు. ఎందుకంటే, దాదాపు రెండేళ్లుగా సెంచరీ చేయని రాహుల్కు బాగా గుర్తుండిపోతుందట. ఈ క్రమంలో.. మాంచెస్టర్ వేదికగా జరిగిన తొలి టీ20లో ఇంగ్లాండ్ బౌలర్లని ఉతికారేసిన కేఎల్ రాహుల్తో ఆ జట్టుకి ఇకపై కూడా కష్టాలు తప్పవని భారత క్రికెట్ దిగ్గజం సునీల్ గవాస్కర్ అభిప్రాయపడ్డాడు.
'విధ్వంసకరమైన ఇన్నింగ్స్తో మరోసారి కేఎల్ రాహుల్ సత్తా చాటాడు. అతను తప్పకుండా భారత క్రికెట్లో తనకంటూ ఓ మంచి గుర్తింపు సాధించుకోగలడు. అరంగేట్రంలో మిచెల్ జాన్సన్లాంటి బౌలర్ని ధైర్యంగా ఢీకొట్టిన రాహుల్.. ఇటీవల శతకంతో తనలో జోరు తగ్గలేదని నిరూపించుకున్నాడు. తొలి టీ20లో అతను ఆడిన ఇన్నింగ్స్తో ఇంగ్లాండ్ బౌలర్లు కనీసం ఊపిరి పీల్చుకోలేకపోయారు. సిరీస్లోనూ వారికి ఆ బాధ తప్పదు' అని సునీల్ గవాస్కర్ వెల్లడించాడు.
గత మంగళవారం జరిగిన ఈ టీ20 మ్యాచ్లో మెరుపు సెంచరీ బాదిన కేఎల్ రాహుల్ టీమిండియాని ఒంటిచేత్తో గెలిపించిన విషయం తెలిసిందే. రెండో టీ20 మ్యాచ్ శుక్రవారం రాత్రి 10 గంటలకి జరగనుండగా.. మూడు టీ20ల ఈ సిరీస్లో ఇప్పటికే 1-0తో ఆధిక్యం సాధించిన భారత్ ఈ మ్యాచ్లో కూడా గెలిచి సిరీస్ని కైవసం చేసుకోవాలని ఉవ్విళ్లూరుతోంది.
తొలి మ్యాచ్లో కుల్దీప్ యాదవ్ బౌలింగ్ను ఎదుర్కొనడం కష్టంగా భావించింది ఇంగ్లాండ్ జట్టు. కేవలం అతణ్ని ఎదుర్కొనడానికి ప్రత్యేకంగా శిక్షణ కూడా తీసుకున్నారు. ఇంకోసారి సొంతగడ్డపై కనీసం రెండో టీ20లోనైనా గెలిచి పరువు నిలుపుకోవాలని ఇంగ్లాండ్ ఆశిస్తోంది. దీంతో.. శుక్రవారం రాత్రి మ్యాచ్ ఆసక్తికరంగా జరగనుంది.