
టీ20ల్లో పరుగుల వరద:
టెస్టు, వన్డే, టీ20ల్లో సెంచరీలు బాదిన మూడో భారతీయుడిగా చరిత్ర సృష్టించిన రాహుల్.. ఇటీవలి కాలంలో అద్భుతంగా రాణిస్తున్నాడు. కొన్నాళ్ల క్రితం జట్టులో చోటు కోల్పోయిన అతడు తిరిగి గాడిన పడ్డాడు. ఫార్మాట్ ఏదైనా పరుగుల వరద పారిస్తున్నాడు. రోహిత్, కోహ్లీ విఫలమయినా నేనున్నానంటూ జట్టుకు అండగా నిలుస్తున్నాడు. ముఖ్యంగా టీ20ల్లో అదరగొడుతున్నాడు. ఇక వికెట్ కీపింగ్ కూడా చేస్తూ ఔరా అనిపిస్తున్నాడు. ఓపెనింగ్, మిడిల్ ఆర్డర్, కీపింగ్ ఏ పాత్ర ఇచ్చినా పోషించడానికి సిద్ధంగా ఉన్నాడు.

2020లో మూడు హాఫ్ సెంచరీలు:
టీ20ల్లో చెలరేగుతున్న లోకేష్ రాహుల్.. ఇప్పుడు కోహ్లీ, రోహిత్కు సాధ్యం కాని ఓ అరుదైన రికార్డు అందుకున్నాడు. 2019 నుంచి టాప్ ఆర్డర్లో ఎక్కువ హాఫ్ సెంచరీలు చేసింది రాహులే. 2019లో నాలుగు (9 ఇన్నింగ్స్), 2020లో మూడు (4 ఇన్నింగ్స్)తో కలిపి మొత్తం 7 అర్ధ శతకాలు సాధించాడు. రోహిత్ నాలుగు అర్ధ శతకాలే చేశాడు. అదికూడా గతేడాది ఆడిన 14 ఇన్నింగ్సులలో. ఈ ఏడాది ఇంకా ఖాతా తెరవలేదు. కోహ్లీ కూడా కొత్త ఏడాదిలో 4 ఇన్నింగ్స్లు ఆడి ఇంకా అర్ధ శతకం నమోదు చేయలేదు. గతేడాది 10 ఇన్నింగ్సుల్లో 5 చేసాడు.

స్టేడియాల్లో రాహుల్ జపం:
ఓపెనర్ శిఖర్ ధావన్ 2019లో 12 ఇన్నింగ్సులు ఆడి ఒక్క అర్ధ శతకం నమోదు చేయలేదు. కొత్త ఏడాదిలో మాత్రం 2 ఇన్నింగ్సుల్లోనే అర్ధ శతకం అందుకున్నాడు. దీంతో కోహ్లీ, రోహిత్కు సాధ్యం కాని అరుదైన రికార్డు రాహుల్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఈ గణాంకాలతో పొట్టి క్రికెట్ ఫార్మాట్లో తనకిక తిరుగులేదని చాటుతున్నాడు. ప్రస్తుతం స్టేడియాల్లో భారత అభిమానులు 'రాహుల్.. రాహుల్' అని పొగిడేస్తున్నారు.


Click it and Unblock the Notifications












