
బెంగళూరు: భారత క్రికెట్ జట్టు వైస్ కేప్టెన్ కేఎల్ రాహుల్.. జర్మనీలో ప్రత్యక్షం అయ్యాడు. గాయం కారణంగా సుదీర్ఘంగా విశ్రాంతిని తీసుకోవాల్సి వచ్చిందతనికి. దక్షిణాఫ్రికాతో అయిదు టీ20 మ్యాచ్ల సిరీస్ను ముగించుకున్న తరువాత టీమిండియా బిజీ షెడ్యూల్ను గడుపుతోంది. రోహిత్ శర్మ సారథ్యంలోని సీనియర్ల జట్టు ఇంగ్లాండ్ పర్యటనలో ఉంది. మరో జట్టు ఐర్లాండ్కు బయలుదేరి వెళ్లడానికి సన్నద్ధంగా ఉంది. ఐర్లాండ్ టీమ్తో రెండు టీ20 మ్యాచ్లను ఆడనుంది. ఈ జట్టుకు హార్దిక్ పాండ్యా కేప్టెన్.
ఈ రెండింట్లోనూ కేఎల్ రాహుల్ సభ్యుడు కాడు. ఆయా సిరీస్లకు అతను దూరం అయ్యాడు. దక్షిణాఫ్రికా సిరీస్కూ అందుబాటులో లేకుండా పోయిన విషయం తెలిసిందే. గజ్జల్లో గాయంతో అతను బాధపడుతున్నాడు. దక్షిణాఫ్రికా సిరీస్ ఆరంభం కావడానికి ముందే అతను గాయపడ్డాడు. బెంగళూరులోని నేషనల్ క్రికెట్ అకాడమీలో ఫిట్నెస్ పరీక్షల అనంతరం జర్మనీకి బయలుదేరి వెళ్లాడు. బెర్లిన్లో ల్యాండ్ అయ్యాడు. దీనికి సంబంధించిన ఫొటోలను తన అధికారిక ఇన్స్టాగ్రామ్లో పోస్ట్ చేశాడు కేఎల్ రాహుల్.
ఇంగ్లాండ్తో ఓ టెస్ట్, మూడు టీ20లు, రెండు వన్డే ఇంటర్నేషనల్స్ ముగించుకున్న వెంటనే భారత జట్టు అటు నుంచి అటే వెస్టిండీస్ పర్యటనకు బయలుదేరి వెళ్తుంది. ఈ పర్యటన నాటికి కేఎల్ రాహుల్.. గాయం నుంచి కోలుకోవాలని భారత క్రికెట్ కంట్రోల్ బోర్డ్ భావిస్తోంది. అందుకే ట్రీట్మెంట్ కోసం అతణ్ని మెరుగైన చికిత్స కోసం జర్మనీకి పంపించంది. దాదాపుగా నెల రోజుల పాటు కేఎల్ రాహుల్ జర్మనీలో ట్రీట్మెంట్ తీసుకోవాల్సి ఉంటుందని తెలుస్తోంది.
ఇండియన్ ప్రీమియర్ లీగ్ టోర్నమెంట్లోనే అతను గజ్జల్లో గాయంతో బాధపడ్డాడని, అప్పట్లో అది ప్రమాదకరం కాకపోవడం వల్ల సీజన్ కొనసాగించాడని సన్నిహిత వర్గాలు చెబుతున్నాయి. దక్షిణాఫ్రికా సిరీస్ నాటికి అది తీవ్రతరం కావడం వల్ల తప్పుకోక తప్పలేదు. జర్మనీలో చికిత్స తీసుకోవడం వల్ల గజ్జల్లో గాయం ఇబ్బంది నుంచి పూర్తిస్థాయిలో విముక్తుడవుతాడని స్పష్టం చేస్తోన్నాయి. కేఎల్ రాహుల్కు గాయాలు కొత్తేమీ కాదు.
ఇదివరకు కండరాల నొప్పితో న్యూజిలాండ్తో టెస్ట్ సిరీస్, వెస్టిండీస్, శ్రీలంకతో టెస్ట్, టీ20 సిరీస్లకు దూరం అయ్యాడు. రిస్ట్ గాయం వల్ల ఆస్ట్రేలియాతో సిరీస్నూ మిస్ అయ్యాడు. ఇప్పుడు తాజాగా దక్షిణాఫ్రికాతో టీ20, ఇంగ్లాండ్, ఐర్లాండ్ సిరీస్ల నుంచీ తప్పుకోవాల్సి వచ్చింది. వెస్టిండీస్ సిరీస్కు అందుబాటులో ఉంటాడా? లేదా? అనేది అతని ట్రీట్మెంట్ మీద ఆధారపడి ఉంది.