టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ తన గాయంపై అప్డేట్ ఇచ్చాడు. ఆర్సీబీ, లక్నో మధ్య జరిగిన మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తున్న సమయంలో రాహుల్ తొడ కండరాలకు గాయమైన సంగతి తెలిసిందే. ఈ గాయంతో ఇబ్బంది పడిన అతను ఆ తర్వాత మ్యాచ్ కూడా ఆడలేదు. ఈ క్రమంలోనే రాహుల్కు శస్త్ర చికిత్స అవసరమని వైద్యులు తేల్చారు.
దీంతో ఐపీఎల్ నుంచి రాహుల్ తప్పుకున్నాడు. అలాగే వచ్చే నెలలో జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్లో కూడా తను ఆడటం లేదని ప్రకటించాడు. తనకు శస్త్ర చికిత్స అవసరమని, అది పూర్తయిన తర్వాత రికవరీపై ఫోకస్ పెడతానని వెల్లడించాడు. అతను చెప్పినట్లే మంగళవారం నాడు ఆపరేషన్ చేయించుకున్నాడు.

దీనిపై తన సోషల్ మీడియాలో కేఎల్ రాహుల్ అప్డేట్ ఇచ్చాడు. 'నా ఆపరేషన్ విజయవంతంగా పూర్తయింది. నేను కంఫర్టబుల్గా ఉండేలా చూసుకున్న వైద్యులు, మెడికల్ స్టాఫ్కు ధన్యవాదాలు. ఇప్పుడు నేను అధికారికంగా రికవరీ రోడ్లో పడ్డా. మళ్లీ నా బెస్ట్కు తిరిగొచ్చి, మైదానంలో దిగాలనే పట్టుదలతో ఉన్నా' అని చెప్పాడు.
ఈ వార్త విన్న చాలా మంది అభిమానులు హర్షం వ్యక్తం చేశారు. రాహుల్ త్వరగా కోలుకోవాలని కామెంట్లు చేస్తున్నారు. వన్డే వరల్డ్ కప్లో టీమిండియాకు రాహుల్ అవసరం చాలా ఉంటుందని, మిడిలార్డర్లో కీలకమైన ఆటగాడని అభిప్రాయపడుతున్నారు. అందుకే అతను ఎంత త్వరగా కోలుకుంటే అంత మంచిదని చెప్తున్నారు.
ఈ గాయం కారణంగా తొలిసారి ఐపీఎల్ను రాహుల్ అర్ధంతరంగా వదిలేయాల్సి వచ్చింది. ఇంగ్లండ్లో మంచి రికార్డు ఉన్న అతను డబ్ల్యూటీసీ ఫైనల్లో కచ్చితంగా రాణిస్తాడని ఫ్యాన్స్ అనుకున్నారు. కానీ గాయంతో ఈ కీలక పోరుకు అతను దూరమయ్యాడు. ఈ వార్త విన్న చాలా మంది బాధ పడ్డారు. అతని స్థానంలో యువ వికెట్ కీపర్ బ్యాటర్ ఇషాన్ కిషన్ను ఇంగ్లండ్ పంపుతున్నట్లు బీసీసీఐ వెల్లడించిన సంగతి తెలిసిందే.