
హైదరాబాద్: ప్రస్తుతం జరుగుతోన్న ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 11వ సీజన్లో ఆటగాళ్లు సంతకాలు చేసిన జెర్సీలు, బ్యాట్లు, టోపీలు అభిమానులు దక్కించుకుంటున్న సంగతి తెలిసిందే. తాజాగా కింగ్స్ ఎలెవన్ పంజాబ్ ఆటగాడు కేఎల్ రాహుల్ తనకు వచ్చిన ఓ అవార్డుని అభిమానికి ఇచ్చేశాడు.
ఇందుకు సంబంధించిన వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది. వివరాల్లోకి వెళితే... ఐపీఎల్ టోర్నీలో భాగంగా బుధవారం రాత్రి ముంబై ఇండియన్స్-కింగ్స్ ఎలెవన్ పంజాబ్ జట్లు తలపడ్డాయి. ఈ మ్యాచ్లో పంజాబ్ ఓపెనర్ కేఎల్ రాహుల్ 94 పరుగులు చేసినప్పటికీ, జట్టుని గెలిపించలేకపోయాడు.
చివరి వరకు ఉత్కంఠభరితంగా సాగిన ఈ మ్యాచ్లో పంజాబ్ 3 పరుగుల తేడాతో ఓటమిపాలైంది. అయితే, ఈ మ్యాచ్లో కేఎల్ రాహుల్కు ఎఫ్బీబీ స్టైలిష్ ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్ అవార్డు దక్కింది. ఈ సందర్భంగా రూ. లక్ష నగదుతో పాటు ఒక ట్రోఫీని కేఎల్ రాహుల్కు అందుకున్నాడు.
అవార్డు తీసుకుని రాహుల్ డ్రస్సింగ్ రూమ్కి వెళ్తున్న క్రమంలో అక్కడే ఉన్న ఫ్యాన్స్ రాహుల్... రాహుల్... అంటూ కేకలు చేశారు. దీంతో రాహుల్ తన చేతిలోని ట్రోఫీని అభిమానులకు ఇచ్చేశాడు. ఈ వీడియో ఇప్పుడు సోషల్ మీడియాలో వైరల్ అయింది.
కాగా, మ్యాచ్ అనంతరం పాండ్యా, రాహుల్ కలిసి ఫుట్ బాల్ ఆటగాళ్ల తరహాలో జెర్సీలు మార్చుకున్నారు. మ్యాచ్ ఫలితం ఎలా ఉన్నా కేఎల్ రాహుల్ వద్దకు వెళ్లిన ముంబై ఇండియన్స్ ఆటగాడు హర్ధిక్ పాండ్యా తన జెర్సీని తీసి రాహుల్కు ఇచ్చి క్రీడాస్ఫూర్తిని చాటుకున్నాడు. అందుకు ప్రతిగా రాహుల్ కూడా పంజాబ్ జెర్సీని హర్ధిక్కు అందజేశారు.