
ఆస్ట్రేలియాతో జరిగిన తొలి వన్డేలో భారత జట్టును ఒంటి చేత్తో గెలిపించిన కేఎల్ రాహుల్ కూడా రెండో వన్డేలో దారుణంగా ఫెయిలయ్యాడు. విశాఖలో మ్యాచ్ ఆరంభమైనప్పటి నుంచి ఆసీస్ లెఫ్ట్ ఆర్మ్ పేసర్ మిచెల్ స్టార్క్ నిప్పులు చెరుగుతున్నాడు. ఈ క్రమంలోనే టీమిండియా బ్యాటర్లు ఒకరి తర్వాత మరొకరు పెవిలియన్కు క్యూ కడుతున్నారు. సూర్యకుమార్ యాదవ్ తను ఎదుర్కొన్న తొలి బంతికే పెవిలియన్ చేరాడు.
మొదటి వన్డేలో అవుటైనట్లే సూర్య పెవిలియన్ చేరడంతో.. కేఎల్ రాహుల్ క్రీజులోకి వచ్చాడు. అనవసరమైన షాట్లు ఆడకుండా క్రీజులో కుదురుకునేందుకు రాహుల్ ప్రయత్నించాడు. అప్పటికే మూడు వికెట్లు కోల్పోయిన భారత్కు కూడా ఇన్నింగ్స్ చక్కదిద్దడం చాలా అవసరం అవడంతో.. ఈ ఆటతీరే కరెక్ట్ అని అంతా అనుకున్నారు.
కానీ 9వ ఓవర్లో స్టార్క్ బంతిని సరిగా అంచనా వేయలేకపోయిన రాహుల్.. మైదానం వీడాల్సి వచ్చింది. స్టార్క్ వేసిన బంతిని ఫ్రంట్ ఫుట్పై ఆడేందుకు రాహుల్ ప్రయత్నించాడు. అయితే బంతి కొంత ఇన్స్వింగ్ అవడంతో దాని లైన్ పూర్తిగా మిస్ అయ్యాడు. ఆ బంతి నేరుగా వెళ్లి రాహుల్ ప్యాడ్లను తాకింది.
అంపైర్ ఒక్క క్షణం ఆలోచించి అవుటిచ్చాడు. బంతి ఎత్తుగా వెళ్లే అవకాశం ఉందని భావించిన రాహుల్.. రివ్యూ కోరాడు. రిప్లేలో బంతి వికెట్లను కూలుస్తున్నట్లు స్పష్టంగా కనిపించింది. దీంతో రాహుల్ 9 పరుగుల వ్యక్తిగత స్కోరు వద్ద మైదానం వీడాల్సి వచ్చింది.
ఆ తర్వాత హార్దిక్ పాండ్యా కూడా ఎక్కువ సేపు క్రీజులో నిలవలేదు. షాన్ ఆబాట్ వేసిన బంతిని అవసరంగా కదిలించుకొని స్లిప్స్లో ఉన్న స్మిత్కు క్యాచ్ ఇచ్చాడు. దీంతో భారత జట్టు పది ఓవర్లు ముగిసే సరికి ఐదు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో మునిగిపోయింది. ఇది చూసిన ఫ్యాన్స్ అందరూ రాహుల్పై మండి పడుతున్నారు. సూర్యను ఫాలో అవుతున్నావా? అని ప్రశ్నిస్తున్నారు.