
హైదరాబాద్: సోమవారం ఐసీసీ ప్రకటించిన టీ20 ర్యాంకుల్లో ఆస్ట్రేలియా ఓపెనర్ ఆరోన్ ఫించ్ అగ్రస్థానాన్ని దక్కించుకున్నాడు. ఐసీసీ ప్రకటించిన ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ ఎడమ చేతివాటం బ్యాట్స్మన్ ఫఖర్ జమాన్ రెండో స్థానంలో ఉండగా.. భారత బ్యాట్స్మన్ కేఎల్ రాహుల్ మూడో స్థానంలో నిలిచాడు.
ఇంగ్లాండ్-భారత్ జట్ల మధ్య మూడు టీ20ల సిరిస్ ముగిసిన వెంటనే ఐసీసీ ఈ ర్యాంకులను ప్రకటించింది. దీంతో ఆతిథ్య ఇంగ్లాండ్తో జరిగిన మూడు టీ20ల సిరిస్లో సెంచరీలతో చెలరేగిన భారత బ్యాట్స్మెన్ కేఎల్ రాహుల్, రోహిత్ శర్మ ర్యాంకుల్లో ఎగబాకారు.
ఆస్ట్రేలియా టీ20 కెప్టెన్గా ఉన్న ఆరోన్ ఫించ్ ముక్కోణపు టీ20 టోర్నీలో చెలరేగి ఆడటంతో ఐసీసీ ప్రకటించిన ర్యాంకుల్లో పించ్ అగ్రస్థానాన్ని కైవసం చేసుకున్నాడు. దీంతో పాటు టీ20ల్లో 900 పాయింట్లు సాధించిన తొలి బ్యాట్స్మెన్గా అరుదైన ఘనత సాధించాడు. ఈ సిరీస్లో జింబాబ్వేపై 172 పరుగులు చేసి టీ20ల్లో అత్యధిక వ్యక్తిగత స్కోరును ఫించ్ నమోదు చేసిన విషయం తెలిసిందే. ఈ రికార్డు తర్వాత ఫించ్ 900 పాయింట్ల మార్క్ను అందుకున్నాడు.
అయితే సిరీస్ ముగిసే సమయానికి 891 పాయింట్లతో తొలి స్థానంలోనే కొనసాగుతున్నాడు. ఈ సిరీస్కు ముందు 763 పాయింట్లతో నాలుగో స్థానంలో ఉన్న ఫించ్.. మొత్తంగా 391 పరుగులు చేశాడు. దీంతో 128 పాయింట్లు తన ఖాతాలో వేసుకొని తొలి స్థానానికి దూసుకొచ్చాడు. మరోవైపు ఈ సిరిస్లో వరుసగా, 61, 6, 47, 73 చొప్పున పరుగులు చేసిన ఫఖర్.. 44 స్థానాలు ఎగబాకి రెండో స్థానాన్ని ఆక్రమించాడు.
ఇటీవల భారత్ ఆడిన టీ20 మ్యాచ్ల్లో 70, 101*, 6, 19 చొప్పున పరుగులు చేసిన కేఎల్ రాహుల్.. 9 స్థానాలు ఎగబాకి కెరీర్లో అత్యుత్తమ ర్యాంక్ను సొంతం చేసుకున్నాడు. భారత్ బ్యాట్స్మెన్లో రోహిత్ శర్మ 11వ ర్యాంక్లో ఉండగా.. కోహ్లీ 12వ స్థానంలో ఉన్నారు.
ఇక, బౌలింగ్ విభాగంలో ఆప్ఘనిస్థాన్ స్పిన్నర్ రషీద్ ఖాన్ అగ్రస్థానంలో ఉండగా.. పాకిస్థాన్ బౌలర్ షాదాబ్ ఖాన్ రెండో స్థానంలో కొనసాగుతున్నాడు. ఇష్ సోథీ, యజువేంద్ర చాహల్ మూడు, నాలుగు స్థానాల్లో కొనసాగతున్నారు. టీమ్ ర్యాంకింగ్స్లో పాకిస్థాన్ తన తొలి స్థానాన్ని నిలబెట్టుకోగా.. ఇంగ్లండ్పై సిరీస్ గెలిచిన ఇండియా ఆస్ట్రేలియాను వెనక్కి నెట్టి రెండోస్థానాన్ని ఆక్రమించింది.
2020లో ఆస్ట్రేలియాలో జరిగే టీ20 వరల్డ్కప్కు ఆస్ట్రేలియా కాకుండా టాప్ 9 ర్యాంకుల్లో ఉన్న టీమ్స్ నేరుగా క్వాలిఫై అవుతాయి. మరో ఆరు జట్లు క్వాలిఫయింగ్ టోర్నీలో ఆడాల్సి ఉంటుంది.