
టీమిండియా తాత్కాలిక సారధి కేఎల్ రాహుల్పై క్రీడాభిమానులు మరోసారి మండిపడ్డారు. బంగ్లాదేశ్తో టెస్టు సిరీస్ ఆరంభానికి ముందు ధనా ధన్ బ్యాటింగ్ చూస్తారని అభిమానులకు మాటిచ్చిన రాహుల్.. తొలి టెస్టులో జిడ్డు బ్యాటింగ్ చేశాడు. దానికితోడు పెద్దగా పరుగులు చేయకుండానే పెవిలియన్ చేరాడు. రెండో టెస్టులో అంతకన్నా జిడ్డు బ్యాటింగ్ చేశాడీ కర్ణాటక ప్లేయర్. తొలి రోజు ఆట ముగిసే సమయానికి 30 బంతుల్లో కేవలం 3 పరుగులు మాత్రమే చేశాడు. దీంతోనే విసుగెత్తిన అభిమానులు.. చివరకు పెద్దగా స్కోర్ చేయకుండానే అతను పెవిలియన్ చేరడంతో మండిపడుతున్నారు.
రెండో రోజు ఆట ప్రారంభమైన తర్వాత కేఎల్ రాహుల్ (45 బంతుల్లో 10) ఏమాత్రం ఆకట్టుకోలేదు. కేవలం వికెట్ కాపాడుకోవడానికి మాత్రమే అతను బ్యాటింగ్ చేసినట్లు చూసే ప్రతి వ్యక్తికీ తెలిసిపోతుంది. చిన్న రిస్క్ తీసుకోవడానికి కూడా భయపడిపోయినట్లు కనిపించిన రాహుల్.. చాలా డిఫెన్సివ్గా ఆడాడు. ఆ తర్వాత ఒక బౌండరీ బాదడంతో అక్కడి నుంచైనా అతని ఆటతీరు మారుతుందని అభిమానులు ఆశించారు. అది మారకపోగా మరింత డిఫెన్స్లో పడిపోయాడు రాహుల్. ఈ క్రమంలోనే తైజుల్ ఇస్లామ్ వేసిన 14వ ఓవర్ తొలి బంతికే పెవిలియన్ చేరాడు.

తైజుల్ వేసిన బంతిని డిఫెండ్ చేసుకోవడానికి రాహుల్ ప్రయత్నించాడు. అయితే అతని బ్యాటు, ప్యాడు రెండూ పక్క పక్కనే ఉన్నాయి. బంతి అతని ప్యాడ్లను తాకగానే బంగ్లా ఆటగాళ్లు అప్పీల్ చేశారు. అంపైర్ కూడా ముందుగా బ్యాటునే బంతి తాకి ఉంటుందని భావించి అవుట్ ఇవ్వలేదు. దీంతో బంగ్లాదేశ్ రివ్యూ కోరింది. రిప్లేలో ఆ బంతి ముందుగా రాహుల్ ప్యాడ్లనే తాకినట్లు స్పష్టంగా కనిపించింది. దానికితోడు మిడిల్, లెగ్ వికెట్లను ఆ బంతి కూలుస్తుందని హాక్ఐ కూడా స్పష్టం చేసింది. దీంతో రాహుల్ నిరాశగా పెవిలియన్ బాటపట్టాడు.