
బంగ్లాదేశ్తో తొలి వన్డేలో భారత జట్టు వికెట్ కీపర్గా కేఎల్ రాహుల్ బాధ్యతలు నిర్వర్తించాడు. అప్పటి వరకు రిషభ్ పంత్ ఈ మ్యాచ్లో ఆడతాడని అంతా అనుకున్నారు. కానీ టాస్ సమయంలో పంత్ ఆడటం లేదని తెలిసింది. ఇదే విషయంపై మ్యాచ్ అనంతరం కేఎల్ రాహుల్కు ప్రశ్నలు ఎదురయ్యాయి. వీటికి బదులిచ్చిన రాహుల్.. పంత్ గురించి తమకు కూడా ముందుగా ఎలాంటి సమాచారం అందలేదని చెప్పాడు.
'నాక్కూడా ఈ విషయం డ్రెస్సింగ్ రూంలోనే తెలిసింది. సడెన్గా పంత్ ఆడటం లేదని చెప్పారు. తనను రిలీజ్ చేస్తున్నామని చెప్పారు. ఎందుకు? ఏంటి? అనే కారణాలు నాకు తెలీదు. ఈ ప్రశ్నలకు మెడికల్ టీం అయితే సరైన సమాధానం చెప్పగలుగుతుంది' అని చెప్పాడు. అదే సమయంలో గతేడాదిగా తాము ఎక్కువ వన్డేలు ఆడలేదని, ఆడిన వాటిలో తాను నాలుగు-ఐదు స్థానాల్లో బ్యాటింగ్ చేశానని చెప్పాడు. అలాగే వికెట్ కీపింగ్ చేసే విషయంలో కూడా తాను ఎప్పుడూ సిద్ధంగా ఉంటానని, జట్టు ఎప్పుడు ఆ బాధ్యతలు తీసుకోమన్నా తీసుకుంటానని స్పష్టం చేశాడు.
మ్యాచ్కు ముందు డ్రెస్సింగ్ రూంలోనే పంత్ ఆడటం లేదని అందరికీ తెలిసిందన్న రాహుల్.. 'నాకు డ్రెస్సింగ్ రూంలో పంత్ కనిపించలేదు. ఏమైందని అందరం అడిగాం. అప్పుడే అతన్ని రిలీజ్ చేసినట్లు తెలిసింది. మేం మ్యాచ్పై ఫోకస్ పెట్టాలి కాబట్టి దీని గురించి ఎక్కువగా ప్రశ్నించలేదు' అని చెప్పాడు.
టాస్ ముగిసిన తర్వాతనే బీసీసీఐ నుంచి స్పష్టమైన ప్రకటన లేకుండా పంత్ ఆడటం లేదనే ప్రకటన వెలువడింది. మెడికల్ సమస్య కారణంగా పంత్ ఈ వన్డే సిరీస్ ఆడటం లేదని, టెస్టు సిరీస్ నాటికి జట్టుతో కలుస్తాడని బీసీసీఐ ప్రకటించింది. అతని స్థానంలో ఇషాన్ కిషన్ ఉన్నప్పటికీ రాహుల్కు కీపింగ్ బాధ్యతలు అప్పగించారు.