IND vs WI: వెస్టిండీస్తో జరుగుతున్న తొలి టెస్ట్ మ్యాచ్ రెండో రోజు ఆట పూర్తిగా భారత్ ఆధిపత్యంలో సాగింది. కేఎల్ రాహుల్, ధ్రువ్ జురsల్ సెంచరీలు సాధించిన తర్వాత, ఆల్రౌండర్ రవీంద్ర జడేజా కూడా సెంచరీ పూర్తి చేసి, భారత్కు భారీ ఆధిక్యాన్ని అందించాడు. రెండో రోజు ఆట ముగిసే సమయానికి, భారత్ తొలి ఇన్నింగ్స్లో 286 పరుగుల ఆధిక్యాన్ని సాధించింది, దీంతో వెస్టిండీస్కు ఇన్నింగ్స్ ఓటమి ముప్పు పొంచి ఉంది.
రెండో రోజు భారత్ పట్టు
విండీస్ తొలి ఇన్నింగ్స్ లో 162 పరుగులకే ఆలౌట్ అయింది. రెండో రోజు స్టంప్స్ సమయానికి భారత్ 448 పరుగుల భారీ స్కోరు సాధించింది.రెండో రోజు ఆటలో విండీస్ బౌలర్లు కేవలం మూడు వికెట్లు మాత్రమే తీయగలిగారు. ఆట ముగిసే సమయానికి రవీంద్ర జడేజా 104, వాషింగ్టన్ సుందర్ 9 పరుగులతో క్రీజులో ఉన్నారు.

ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు సెంచరీ హీరోలు
కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్ తర్వాత రవీంద్ర జడేజా కూడా సెంచరీ సాధించడంతో, ఒకే ఇన్నింగ్స్లో ముగ్గురు భారత బ్యాటర్లు శతకాలు నమోదు చేసిన అరుదైన రికార్డు నమోదైంది.
2025లో భారత్కు ఒకే ఇన్నింగ్స్లో మూడు సెంచరీలు చేసిన వారు వీరే..
*యశస్వి జైస్వాల్, శుభ్మన్ గిల్, రిషబ్ పంత్ (vs ఇంగ్లాండ్, లీడ్స్)
*శుభ్మన్ గిల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్ (vs ఇంగ్లాండ్, మాంచెస్టర్)
*కేఎల్ రాహుల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా (vs వెస్టిండీస్, అహ్మదాబాద్)
రవీంద్ర జడేజా ఆరో సెంచరీ
తన కెరీర్లో 86వ టెస్ట్ మ్యాచ్ ఆడుతున్న రవీంద్ర జడేజాకు ఇది ఆరో టెస్ట్ సెంచరీ. ఇంగ్లాండ్ పర్యటనలో కూడా శతకం సాధించిన జడేజా (5 మ్యాచ్లలో 516 పరుగులు), అదే ఫామ్ను కొనసాగించాడు. 168 బంతుల్లో 6 ఫోర్లు, 5 సిక్సర్ల సాయంతో జడేజా సెంచరీ పూర్తి చేశాడు.
రాహుల్, జురేల్, జడేజా ప్రదర్శన
కేఎల్ రాహుల్ తొలి సెషన్లో తన 11వ టెస్ట్ సెంచరీని (100 పరుగులు) పూర్తి చేసి లంచ్ తర్వాత వెంటనే ఔటయ్యాడు. శుభ్మన్ గిల్తో కలిసి మూడో వికెట్కు 98 పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పాడు. రాహుల్, శుభ్మన్ గిల్ (50 పరుగులు) ఔటైన తర్వాత క్రీజులోకి వచ్చిన ధ్రువ్ జురేల్ (125 పరుగులు), రవీంద్ర జడేజా కలిసి ఐదో వికెట్కు ఏకంగా 206 పరుగుల భారీ భాగస్వామ్యాన్ని జోడించారు. జురెల్ తన తొలి టెస్ట్ సెంచరీని 210 బంతుల్లో 15 ఫోర్లు, 3 సిక్సర్లతో పూర్తి చేసి, జట్టును 400 పరుగుల మార్కు దాటించాడు. ఈ అద్భుతమైన బ్యాటింగ్ ప్రదర్శనతో భారత్ మ్యాచ్పై పూర్తి పట్టు సాధించింది.