ఆర్సీబీతో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడిన టీమిండియా స్టార్ కేఎల్ రాహుల్ షాకింగ్ విషయం వెల్లడించాడు. తాను మిగతా ఐపీఎల్ మ్యాచుల్లో ఆడటం లేదని ప్రకటించాడు. అతను గాయపడిన తర్వాత ఈ విషయంపై తీవ్రమైన చర్చ జరిగింది. చెన్నైతో లక్నో ఆడాల్సిన మ్యాచ్లో కూడా రాహుల్ లేడు. అతని స్థానంలో కృనాల్ పాండ్యాకు కెప్టెన్సీ అప్పగించారు.
ఈ క్రమంలోనే తన గాయం గురించి రాహుల్ తన సోషల్ మీడియాలో స్పందించాడు. 'మెడికల్ టీంను సంప్రదించిన తర్వాత.. చాలా ఆలోచించి నా తొడకు శస్త్రచికిత్స అవసరమని తేల్చారు. వచ్చే కొన్ని వారాల్లో ఆపరేషన్ చేయించుకొని, కోలుకోవడంపైనే నా ఫోకస్ ఉంటుంది. ఈ నిర్ణయం తీసుకోవడం చాలా కష్టంగా అనిపించింది. కానీ ఫుల్ రికవరీ జరగాలంటే తప్పదు' అని రాహుల్ తెలిపాడు.

'టోర్నీ కీలకమైన స్థితిలో ఉండగా.. జట్టుకు దూరమైనందుకు ఒక కెప్టెన్గా చాలా బాధగా ఉంది. కానీ నేను లేకపోయినా టీం మెంబర్స్ అందరూ రాణించి, బెస్ట్ పెర్ఫామెన్స్ చేస్తారని నమ్మకం ఉంది. మీ అందరితో కలిసి నేను కూడా అన్ని మ్యాచులూ చూస్తూ లక్నో సూపర్ జెయింట్స్కు మద్దతుగా ఉంటా' అని వెల్లడించాడు. అలాగే తను వచ్చే నెల జరిగే డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా ఆడటం లేదని షాకింగ్ వార్త చెప్పాడు.
'వచ్చే నెల ఓవల్ వేదికగా జరిగే మ్యాచ్లో భారత జట్టుకు దూరం అవుతున్నందుకు చాలా బాధగా ఉంది. కానీ ఎలాగైనా కోలుకొని మళ్లీ బ్లూజెర్సీలో దేశానికి సేవ చేసేందుకు కష్టపడతా. నా ఫోకస్, ప్రయారిటీ ఎప్పటికీ భారత జట్టే. అలాగే ఇలాంటి కష్టమైన సమయంలో నాకు మద్దతుగా నిలిచి బలంగా మారిన ఫ్యాన్స్, లక్నో టీం మేనేజ్మెంట్, బీసీసీఐ, టీంమేట్స్ అందరికీ కృతజ్ఞతలు చెప్పాలని అనుకుంటున్నా' అని పేర్కొన్నాడు.
తన గాయం గురించి ఎప్పటికప్పుడు అప్డేట్స్ ఇస్తానని, సాధ్యమైనంత త్వరగా మళ్లీ క్రికెట్ ఆడేందుకు ప్రయత్నిస్తానని రాహుల్ చెప్పాడు. ఇటీవల ఆడలేక చాలా ఇబ్బంది పడ్డానని, కానీ త్వరలోనే కోలుకొని మళ్లీ పునరాగమనం చేస్తాననే నమ్మకం తనకుందని రాహుల్ ధీమా వ్యక్తం చేశాడు. గాయాలు ఎప్పుడూ సింపుల్గా ఉండవని, కానీ తను మాత్రం ఎప్పట్లాగే పూర్తి ఎఫర్ట్ పెడతానని అన్నాడు. తనకు మద్దతుగా నిలిచిన వారందరికీ ధన్యవాదాలు తెలియజేశాడు.