టీమిండియా వికెట్ కీపర్ కేఎల్ రాహుల్ను అఫ్గానిస్థాన్ సిరీస్కు ఎంపిక చేయని విషయం తెలిసిందే. భారత్ తరపున అతడు టీ20ల ఫార్మాట్కు దూరమై దాదాపు 14 నెలలు గడిచిపోయాయి. గత టీ20 ప్రపంచకప్ సెమీఫైనల్లో రోహిత్, కోహ్లితో కలిసి పొట్టిఫార్మాట్లో చివరిగా టీ20 ఆడాడు. అయితే రోహిత్, కోహ్లిలను అఫ్గాన్ సిరీస్కు ఎంపిక చేయగా, రాహుల్కు నిరాశే మిగిలింది. టీ20లకు రాహుల్ను ఎంపిక చేయకపోవడానికి గల కారణాన్ని వెల్లడించలేదు.
అయితే ఇంగ్లాండ్తో జరగనున్న అయిదు టెస్టుల సిరీస్లో తొలి రెండు మ్యాచ్లకు ప్రకటించిన భారత జట్టులో కేఎల్ రాహుల్ చోటు సంపాదించాడు. కానీ వికెట్ కీపర్గా కాకుండా, కేవలం బ్యాట్స్మన్ స్థానంలో రాహుల్ను ఎంపిక చేసినట్లు బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. టర్నింగ్ పిచ్లపై వికెట్ కీపింగ్ బాధ్యతలు నిర్వర్తించడం అంత తేలిక కాదని, అందుకే ఆ బాధ్యతల నుంచి రాహుల్ను పక్కనపెట్టామని చెప్పారు. గ్లవ్స్ అందుకునే బాధ్యతలకు స్పెషలిష్ట్ వికెట్ కీపర్లు కేఎస్ భరత్, ధ్రువ్ జురెల్ ఎంపికయ్యారని వివరించారు.

'' ఇప్పటి నుంచి కేఎల్ రాహుల్ స్పెషలిస్ట్ బ్యాటర్. విదేశాల్లో జరిగిన టెస్టుల్లో ఫాస్ట్ బౌలింగ్కు వికెట్లు వెనుక ఉంటే సరిపోతుంది. కానీ భారత్లో అలా కాదు. ఇక్కడ స్పిన్నర్లు బంతుల్ని గింగరాలు తిప్పుతారు. స్పిన్ అనుకూలించే ఇక్కడి పిచ్లపై బౌన్స్ అవ్వొచ్చు, స్పిన్ అవ్వొచ్చు. వికెట్ కీపింగ్ అంత సులువు కాదు. తరుచూ కదులుతూ ఉండాల్సి ఉంటుంది. అందుకే స్పెషలిస్ట్ వికెట్ కీపర్ను తీసుకోవాలని భావించాం''
''అయితే రాహుల్ ఎంతో విలువైన బ్యాటర్. గ్లవ్స్ బాధ్యతలతో అతడిపై ఒత్తిడి పెంచాలని అనుకోవట్లేదు. అంతేకాకుండా కీపింగ్ బాధ్యతలతో అతడు గాయపడే అవకాశాలు కూడా ఉన్నాయి. అందుకే ఇంగ్లాండ్ సిరీస్లో భరత్, ధ్రువ్ను వికెట్ కీపర్గా ఎంపిక చేశాం'' అని బీసీసీఐ అధికారి ఒకరు తెలిపారు. జనవరి 25 నుంచి భారత్-ఇంగ్లాండ్ మధ్య టెస్టు సిరీస్ ప్రారంభం కానుంది. హైదరాబాద్లోని ఉప్పల్ స్టేడియంలో తొలి మ్యాచ్ జరగనుంది.
మరోవైపు జట్టులో స్థానాన్ని సుస్థిరం చేసుకోవడానికి కేఎస్ భరత్కు ఈ టెస్టు సిరీస్ చక్కని అవకాశం. అతడు చివరిగా గత వరల్డ్ టెస్టు ఛాంపియన్షిప్ ఫైనల్లో ఆడాడు. రెండు ఇన్నింగ్స్ల్లో కలిపి 28 పరుగులే చేశాడు. అయిదు టెస్టులు ఆడిన భరత్ 18 సగటుతో 129 పరుగులు చేశాడు. ధ్రువ్ విషయానికొస్తే.. దేశవాళీ క్రికెట్లో అతడు 46 సగటుతో 790 పరుగులు చేశాడు.