KL Rahul: ఢిల్లీ స్టార్ బ్యాటర్ కేఎల్ రాహుల్ చరిత్ర సృష్టిచాడు. టీ20 క్రికెట్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు చేసిన భారత క్రికెటర్గా కేఎల్ రాహుల్ రికార్డు నెలకొల్పాడు. ఈ నేపథ్యంలోనే రన్ మెషీన్ విరాట్ కోహ్లీ రికార్డును కూడా బద్ధలు కొట్టాడు. కింగ్ కోహ్లీ 243 ఇన్నింగ్స్ల్లో 8 వేల పరుగుల మైలురాయిని చేరుకోగా.. కేఎల్ రాహుల్ కేవలం 224 ఇన్నింగ్స్ల్లోనే ఈ రికార్డును సాధించడం గమనార్హం. ఐపీఎల్లో ఢిల్లీ క్యాపిటల్స్ జట్టు తరఫున కేఎల్ రాహుల్ ఆడుతున్న సంగతి తెలిసిందే. గుజరాత్ టైటాన్స్ జట్టుపై ఈ ఫీట్ ను సాధించాడు కేఎల్ రాహుల్. ఈ మ్యాచ్ లో తన సెంచరీని కూడా పూర్తి చేసుకున్నాడు. 60 బంతుల్లో శతకాన్ని పూర్తి చేశాడు.
ఇదిలా ఉండగా.. టీ20ల్లో అతి తక్కువ ఇన్నింగ్స్ల్లో 8000 పరుగులు పూర్తి చేసిన మూడో బ్యాటర్గా కూడా కేఎల్ రాహుల్ రికార్డును సాధించాడు. టీ20ల్లో అత్యంత వేగంగా 8 వేల పరుగులు పూర్తి చేసి ఘనత వెస్టిండీస్ దిగ్గజం క్రిస్ గేల్ పేరిట ఉంది. క్రిస్ గేల్ 213 ఇన్నింగ్స్ల్లో ఈ ఘనతను సాధించాడు. పాకిస్థాన్ ఆటగాడు బాబర్ ఆజం 2022లో తన 227 మ్యాచ్లు , 218 ఇన్నింగ్స్లలో ఈ మైలురాయిని సాధించాడు. మూడో స్థానంలో కేఎల్ రాహుల్ ఉండగా.. తర్వాతి స్థానాల్లో వరుసగా విరాట్ కోహ్లీ, పాక్ క్రికెట్ మహ్మద్ రిజ్వాన్(244) ఉన్నారు.

టీ20ల్లో అత్యంత వేగంగా 8000 పరుగులు చేసిన ఆటగాళ్లు వీరే..
1.క్రిస్ గేల్ - 213 ఇన్నింగ్స్
2.బాబర్ ఆజం - 218 ఇన్నింగ్స్
3.కేఎల్ రాహుల్ -224 ఇన్నింగ్స్
4. విరాట్ కోహ్లీ -243 ఇన్నింగ్స్
5.మహ్మద్ రిజ్వాన్ -244 ఇన్నింగ్స్
6. ఆరోన్ ఫించ్ - 254 ఇన్నింగ్స్