
అహ్మదాబాద్: బుధవారం జరగనున్న రెండో వన్డేకు ముందు టీమిండియా అభిమానులకు గుడ్న్యూస్. వ్యక్తిగత కారణాలతో తొలి వన్డేకు దూరమైన వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ జట్టులో చేరాడు. అతనితోపాటు మరో ఓపెనర్ మయాంక్ అగర్వాల్ కూడా క్వారంటైన్ పూర్తి చేసుకుని టీమిండియాతో కలిశాడు. ఇక కరోనా బారిన పడిన నవ్దీప్ సైనీ కూడా వైరస్ నుంచి కోలుకుని జట్టుతో కలిశాడు. వీరు ముగ్గురు నేడు మిగతా జట్టుతో కలిసి అహ్మదాబాద్ స్టేడియంలో వెస్టిండీస్తో రెండో మ్యాచ్ కోసం ప్రాక్టీస్ చేశారు. ఇందుకు సంబంధించిన ఫోటోలను బీసీసీఐ తన అధికారిక ట్విట్టర్ ఖాతాలో పోస్ట్ చేయగా వైరల్గా మారాయి. కాగా సోదరి వివాహం కారణంగా వైస్ కెప్టెన్ కేఎల్ రాహుల్ విండీస్తో తొలి వన్డేకు దూరమయ్యాడు. ఇక టీమిండియాలో భారీగా కరోనా కేసులు నమోదవడంతో మయాంక్ అగర్వాల్ను బీసీసీఐ జట్టులో చేర్చింది. దీంతో అతను అహ్మదాబాద్లో నిబంధనల ప్రకారం క్వారంటైన్ పూర్తి చేసుకున్నాడు. ఇక నవదీప్ సైనీ కరోనా బారిన పడడంతో తొలి వన్డేకు దూరంగా ఉన్నాడు.
వెస్టిండీస్తో వన్డే సిరీస్కు ముందు టీమిండియాలో భారీగా కరోనా కేసులు నమోదయ్యాయి. ఏకంగా ఏడుగురు కరోనా బారిన పడ్డారు. ఇందులో నలుగురు ఆటగాళ్లు ఉండగా.. మరో ముగ్గురు జట్టు సహాయక సిబ్బంది ఉన్నారు. కరోనా బారిన పడిన ఆటగాళ్లలో శిఖర్ ధావన్, రుతురాజ్ గైక్వాడ్, శ్రేయస్ అయ్యర్, నవదీప్ సైనీ ఉన్నారు. కరోనా బారిన పడిన వారందరినీ వెంటనే ఐసోలేషన్లోకి తరలించి చికిత్స అందిస్తున్నారు. ఈ క్రమంలోనే బౌలర్ నవదీప్ సైనీ వైరస్ నుంచి కోలుకుని జట్టుతో కలిశాడు. కరోనా కేసులు నిర్దారణ అయిన సమయంలో టీ20 సిరీస్కు ఎంపికైన ఇషాన్ కిషన్, షారూక్ ఖాన్ను బీసీసీఐ వెంటనే వన్డే జట్టులో చేర్చింది.
ఆదివారం జరిగిన తొలి వన్డేలో వెస్టిండీస్పై టీమిండియా ఘనవిజయం సాధించింది. ఈ మ్యాచ్లో భారత్ 6 వికెట్ల తేడాతో గెలిచి 1000వ వన్డేను చిరస్మరణీయం చేసుకుంది. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన వెస్టిండీస్ భారత బౌలర్ల ధాటికి 176 పరుగులకే కుప్పకూలింది. భారత బౌలర్లలో చాహల్ 4, వాషింగ్టన్ సుందర్ 3 వికెట్లతో చెలరేగారు. ప్రసిద్ధ్ కృష్ణ 2, సిరాజ్ ఒక్క వికెట్ తీశారు. అనంతరం 177 పరుగుల లక్ష్యాన్ని భారత్ సునాయసంగా చేధించింది. గాయం నుంచి కోలుకుని జట్టులో చేరిన కెప్టెన్ రోహిత్ శర్మ 60 పరుగులతో రాణించాడు. 4 వికెట్లతో చెలరేగిన చాహల్కు ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.