టీమిండియా స్టార్ ప్లేయర్ కేఎల్ రాహుల్ తన ప్రేయసి అతియాా శెట్టికి మూడు ముళ్లు వేయనున్నాడు. వీళ్లిద్దరూ సోమవారం సాయంత్రం వివాహం చేసుకుంటారని అతియా తండ్రి సునీల్ శెట్టి కూడా ధ్రువీకరించాడు. సాయంత్రం 4 గంటల సమయంలో వివాహ తంతు జరుగుతుందని, అనంతరం కొత్త జంట ఫొటోలు బయటకు వస్తాయని సమాచారం. ఈ క్రమంలో కేఎల్ రాహుల్ అభిమానులు నెట్టింట తెగ హల్ చల్ చేస్తున్నారు. రాహుల్ జంటకు శుభాకాంక్షలు తెలుపుతూ సోషల్ మీడియాలో హీట్ పెంచుతున్నారు.
కేఎల్ రాహుల్, అతియా శెట్టి మూడేళ్లుగా డేటింగ్ చేస్తున్నారు. వీళ్ల బంధం 2019లో మొదలైంది. ఆ తర్వాత నెమ్మదిగా ఒకరికొకరు దగ్గరయ్యారు. రాహుల్ విదేశాల్లో సిరీస్లు ఆడేందుకు వెళ్లినప్పుడు అతియా కూడా అతని వెంట వెళ్లేది. సోషల్ మీడియాలో కూడా చేసిన పోస్టులను ఒకరివి మరొకరు షేర్ చేసుకునేవారు. ముఖ్యంగా బర్త్ డే విషెస్ చేస్తూ చేసిన పోస్టులు షేర్ చేసుకునేవారు. ఇప్పుడు వీళ్లిద్దరూ ఖండాలాలోని ఒక ఫాంహౌస్లో పెళ్లి పీటలు ఎక్కేందుకు రెడీ అవుతున్నారు.
ఈ పెళ్లికి పలువురు సినీ ప్రముఖులు హాజరవుతున్నారు. అలాగే టీమిండియా ఆటగాళ్లు కూడా ఈ వేడుకలో పాల్గొంటారట. ఈ పెళ్లిలో దక్షిణ భారతీయ వంటకాలు ప్రత్యేకంగా చేయించారట. అయితే మూడో వన్డే కోసం భారత జట్టు ఇండోర్ వెళ్లిన సంగతి తెలిసిందే. ఈ క్రమంలో ఎందరు ఈ పెళ్లికి హాజరవుతారో తెలియదు. ఇలా బిజీగా ఉండి పెళ్లికి రాలేకపోయిన వారందరి కోసం ఐపీఎల్ ముగిసిన తర్వాత భారీ స్థాయిలో రిసెప్షన్ ఏర్పాటు చేయాలని రాహుల్ జంట అనుకుంటోందట. ఈ క్రమంలో నెట్టింట ఈ కొత్త జంటకు శుభాకాంక్షలు వెల్లువెత్తుతున్నాయి. 'కొత్త జంటకు కంగ్రాట్స్' అంటూ అభిమానులు సోషల్ మీడియాను హోరెత్తిస్తున్నారు.