
అబుదాబి: అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా అబుదాబి వేదికగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్ మోస్తరు స్కోరుకే పరిమితమైంది. నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 142 రన్స్ చేసి.. కోల్కతా ముందు 143 పరుగుల లక్ష్యాన్ని ఉంచింది. సన్రైజర్స్ వన్డౌన్ బ్యాట్స్మన్ మనీశ్ పాండే అర్ధ శతకంతో రాణించాడు. 38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్సర్ల సాయంతో 51 రన్స్ చేశాడు. పాండే హాఫ్ సెంచరీ చేసినా.. మెరుపులు మాత్రం మెరిపించలేదు. డెత్ ఓవర్లలో కోల్కతా బౌలర్లు అద్భుత బంతులేయడంతో సన్రైజర్స్ బ్యాట్స్మన్ భారీగా పరుగులు చేయలేకపోయారు. నైట్రైడర్స్ బౌలర్లలో పాట్ కమిన్స్, ఆండ్రీ రస్సెల్ తలో వికెట్ తీశారు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్కు శుభారంభం లభించలేదు. ఓపెనర్ జానీ బెయిర్స్టో (5) జట్టు స్కోరు 24 వద్ద పెవిలియన్ చేరాడు. ఆస్ట్రేలియా స్టార్ పేసర్ పాట్ కమిన్స్ వేసిన నాలుగో ఓవర్లో బెయిర్ స్టో బౌల్డ్ అయ్యాడు. కోల్కతా బౌలర్లు గొప్పగా బౌలింగ్ చేశారు. దీంతో మరో ఓపెనర్ డేవిడ్ వార్నర్ తన సహజ శైలికి పూర్తి బిన్నంగా ఆడాడు. మనీష్ పాండేతో కలిసి ఆచితూచి ఆడుతూ ఇన్నింగ్స్ను చక్కదిద్దే ప్రయత్నం చేశాడు.
డేవిడ్ వార్నర్ క్రీజులో ఉన్నంత సేపు ఎక్కువగా సింగిల్స్ తీయడానికే ప్రయత్నించాడు. 30 బంతుల్లో కేవలం 2 రెండు ఫోర్లు, ఒక సిక్స్ మాత్రమే బాదాడు. ఇక యువ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి వేసిన 10వ ఓవర్ తొలి బంతికే వార్నర్ .. రిటర్న్ క్యాచ్ ఇచ్చి ఔట్ అయ్యాడు. ఐపీఎల్ 2020లో చక్రవర్తికి ఇదే మొదటి వికెట్. మిడిల్ ఆర్డర్ బ్యాట్స్మన్ ఫామ్లో లేకపోవడంతో సన్రైజర్స్పై ఒత్తిడి పెరిగింది. వార్నర్ వెనుదిరగడంతో స్కోరు వేగం మందగించింది.
అయితే మనీష్ పాండే (51;38 బంతుల్లో 3 ఫోర్లు, 2 సిక్స్లు) ఇన్నింగ్స్ను చక్కదిద్దెందుకు ప్రయత్నం చేశాడు. మరోవైపు వృద్ధిమాన్ సాహా (30 ; 31 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్) నెమ్మదిగా ఆడాడు. ఈ జోడి 62 పరుగుల భాగస్వామ్యం నెలకొల్పారు. హాఫ్ సెంచరీ అనంతరం పాండే ఔట్ కాగా.. చివరి ఓవర్లో సాహా పెవిలియన్ చేరాడు. కేకేఆర్ కట్టుదిట్టమైన బౌలింగ్లో ఎస్ఆర్హెచ్ పరుగులు చేయడానికి అపసోపాలు పడింది. కమిన్స్, రస్సెల్ రెచ్చిపోవడంతో స్లాగ్ ఓవర్లలో పరుగులు రావడం కష్టంగా మారింది.