ప్లేఆఫ్స్ రేసులో చాలా కీలకమైన మ్యాచ్లో పంజాబ్ కింగ్స్ను కేకేఆర్ ఓడించింది. చివరి బంతిని నెగ్గిన కేకేఆర్.. పాయింట్ల పట్టికలో 8వ స్థానం నుంచి ఏకంగా ఐదో స్థానానికి ఎగబాకింది. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన పంజాబ్ ముందుగా బ్యాటింగ్ ఎంచుకుంది. ఈడెన్ గార్డెన్స్లో ఈ సీజన్లో ఛేజింగ్ టీమ్స్ కేవలం ఒక్క మ్యాచ్లోనే గెలిచాయి. ఈ క్రమంలోనే పంజాబ్ సారధి శిఖర్ ధవన్ ఈ నిర్ణయం తీసుకున్నాడు.
అయితే భారీ స్కోర్లు నమోదవ్వాల్సిన ఈ మ్యాచ్లో పంజాబ్ అనుకున్నంత స్కోరు చేయలేకపోయింది. ఓపెనర్ ప్రభ్సిమ్రాన్ (12), భానుక రాజపక్స (0) ఘోరంగా విఫలమయ్యారు. అయితే మిగతా బ్యాటర్లతో కలిసి కెప్టెన్ శిఖర్ ధవన్ (57) చివరి వరకు పోరాడాడు. దీంతో నిర్ణీత 20 ఓవర్లలో పంజాబ్ కింగ్స్ 7 వికెట్ల నష్టానికి 179 పరుగులు చేసింది.

ఈ టార్గెట్ను ఛేదించడంలో కేకేఆర్కు శుభారంభం దక్కలేదు. రహ్మనుల్లా గుర్బాజ్ (15) విఫలమయ్యాడు. అయితే జేసన్ రాయ్ (38)తో జతకలిసిన నితీష్ రాణా (51) చక్కగా ఆడాడు. ఆ తర్వాత ఆండ్రీ రస్సెల్ (43), రింకూ సింగ్ (21 నాటౌట్) ధనాధన్ ఇన్నింగ్సులు ఆడారు. చివరి బంతికి బౌండరీ బాదిన రింకూ సింగ్ మరోసారి కేకేఆర్కు థ్రిల్లింగ్ విక్టరీ అందించాడు.
ఈ విజయంపై స్పందించిన నితీష్ రాణా.. 'నేను బ్యాటింగ్ చేసేటప్పుడు ఒక ఎండ్లో వికెట్ పడకుండా చూసుకోవాలని అనుకున్నా. వెంకీ మడమ నొప్పితో బాధ పడుతున్నాడు. దీంతో అడపా దడపా ఒక ఓవర్లో భారీగా పరుగులు చేసేందుకు ప్రయత్నించాం. పది మ్యాచులు పూర్తయ్యాయి. ఇప్పటి వరకు ఆండ్రీ రస్సెల్ నుంచి ఇలాంటి సూపర్ ఇన్నింగ్స్ కోసమే ఎదురు చూస్తూ వచ్చాం' అని చెప్పాడు.
'నేను రస్సెల్కు మద్దతు ఇస్తూనే ఉన్నా. నువ్వు చాలా చేశావ్. ఏదో ఒక మ్యాచ్ నువ్వే గెలిపిస్తావ్ అని తనకు చెప్పా. ఈ పిచ్పై హోం గ్రౌండ్ అడ్వాంటేజ్ కూడా ఉన్నట్లే అనిపించింది. మా బౌలర్లు డెత్ ఓవర్లలో సరిగా బౌలింగ్ చేయలేదు. ఇది 160-165 పరుగుల పిచ్. దీంతో అన్ని పరుగులు ఇవ్వడంతో నాకు బాగా కోపం వచ్చింది' అని వెల్లడించాడు.
'అదే సమయంలో రస్సెల్కు కాన్ఫిడెన్స్ ఇచ్చేందుకు ప్రయత్నించా. తన సత్తాపై మా అందరికీ నమ్మకం ఉంది. రస్సెల్ సాధించిన ఘనతలు అంత ఈజీ కాదు. ఇక రింకూ గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. అతను క్రీజులో ఉన్నప్పుడు ప్రేక్షకులు అందరూ రింకూ.. రింకూ.. అని అరుస్తున్నారు. ఇదంతా అతను ఈ ఏడాది తన కష్టంతో సంపాదించుకున్న అభిమానమే' అని మెచ్చుకున్నాడు.