పంజాబ్ కింగ్స్, కోల్కతా నైట్ రైడర్స్ మధ్య థ్రిల్లింగ్ మ్యాచ్ ప్రేక్షకులకు మంచి ఎంటర్టైన్మెంట్ అందించింది. ఈ మ్యాచ్లో కూడా కేకేఆర్ యంగ్ ప్లేయర్ రింకూ సింగ్ అదరగొట్టాడు. చివరి బంతికి బౌండరీ బాది తన జట్టుకు విజయం అందించాడు. అయితే ఈ విజయం సాధించిన సంతోషం మాత్రం నితీష్ రాణాకు పెద్దగా లేకుండా పోయింది.
ఈ మ్యాచ్లో కోల్కతా జట్టు నిర్ణీత సమయంలో తమ ఓవర్లు వేయలేకపోయింది. దీంతో స్లో ఓవర్ రేట్ కారణంగా నితీష్ రాణాకు ఫైన్ పడింది. అతని మ్యాచ్ ఫీజులో 12 శాతం కోత విధిస్తున్నట్లు బీసీసీఐ వెల్లడించింది. రాణాకు ఇలా స్లో ఓవర్ రేట్ కారణంగా ఫైన్ పడటం ఈ సీజన్లో ఇదే తొలిసారి. ఇప్పటికి దాదాపు ప్రతి జట్టు కెప్టెన్ ఈ ఫైన్ ఎదుర్కోవడం గమనార్హం.

ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన ఈ మ్యాచ్లో పంజాబ్ గెలిచేలా కనిపించింది. అయితే చాలా రోజుల తర్వాత తనదైన స్టైల్లో చెలరేగిన ఆండ్రీ రస్సెల్ (43) అద్భుతమైన ఇన్నింగ్స్తో మ్యాచ్ ఫలితాన్ని మార్చేశాడు. అతనితోపాటు రింకూ సింగ్ కూడా కేవలం 12 బంతుల్లోనే 21 పరుగులతో అజేయంగా నిలిచాడు. అర్షదీప్ సింగ్ వేసిన చివరి ఓవర్ చివరి బంతికి బౌండరీ బాది జట్టును గెలిపించాడు.
ఈ విజయంతో ప్లేఆఫ్స్ రేసులో కేకేఆర్ మరో అడుగు ముందుకేసింది. పది పాయింట్లతో ఐదో స్థానానికి చేరుకుంది. దీంతోపాటు ఇంకా చాలా జట్ల వద్ద పది పాయింట్లు ఉన్నా కూడా.. నెట్ రన్ రేట్ మెరుగ్గా ఉన్న కారణంగా కేకేఆర్ ఐదో స్థానానికి చేరింది. ఇక్కడి నుంచి అన్ని జట్లకు ప్రతి మ్యాచ్ కీలకమే. ఏ జట్టు ఎక్కువ మ్యాచులు గెలిస్తే అదే ప్లేఆఫ్స్ చేరుతుంది.