లక్నో సూపర్ జెయింట్స్తో జరిగిన తమ చివరి లీగ్ మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్కు ఓటమి ఎదురైంది. ఈ మ్యాచ్లో చివరి వరకు పోరాడిన కేకేఆర్ కేవలం ఒక్క పరుగు తేడాతో ఓడిపోయింది. దీంతో లక్నో వరుసగా రెండో సారి ప్లేఆఫ్స్ చేరుకుంది. కేకేఆర్ యువ హీరో రింకూ సింగ్ (63 నాటౌట్) హీరోయిక్ ఇన్నింగ్స్ వృధా అయింది.
ఈ మ్యాచ్లో టాస్ ఓడిన లక్నో ముందుగా బ్యాటింగ్ చేసింది. ఆరంభం నుంచే తమ స్పిన్ బౌలింగ్తో లక్నో బ్యాటర్లను కేకేఆర్ కట్టడి చేసింది. ఫామ్లో ఉన్న మార్కస్ స్టొయినిస్ (0) డకౌట్ కూడా చేసింది. అయితే చివర్లో నికోలస్ పూరన్ అద్భుతంగా ఆడాడు. కేవలం 30 బంతుల్లోనే 58 పరుగులతో అలరించాడు.

కుర్ర బ్యాటర్ ఆయుష్ బదోనీతో (25)తో కలిసి 74 పరుగుల కీలక భాగస్వామ్యం నెలకొల్పాడు. దీంతో లక్నో జట్టు 176 పరుగుల టఫ్ టార్గెట్ సెట్ చేసింది. లక్ష్య ఛేదనలో కేకేఆర్కు మంచి ఆరంభమే లభించింది. జేసన్ రాయ్ (46) మరోసాకి ఆకట్టుకున్నాడు. అయితే మిగతా బ్యాటర్లు అనుకున్న స్థాయిలో రాణించలేదు.
లక్నో స్పిన్నర్ల ధాటికి ఒకరొకరుగా అందరూ పెవిలియన్కు క్యూ కట్టారు. ఇలాంటి సమయంలో రింకూ సింగ్ క్రీజులోకి వచ్చాడు. ఆరంభంలో తన ఇన్నింగ్స్ను నిదానంగా ప్రారంభించిన అతను.. క్రీజులో కుదురుకున్న తర్వాత భారీ షాట్లతో అలరించాడు. కానీ చివరి రెండు బంతుల్లో కేకేఆర్ విజయానికి 12 పరుగులు అవసరమవగా.. కేవలం 10 రన్స్ మాత్రమే చేయగలిగాడు.
దీంతో ఒక్క పరుగు తేడాతో కేకేఆర్ ఓటమిపాలైంది. ఈ ఓటమిపై కేకేఆర్ సారధి నితీష్ రాణా స్పందించాడు. 'ఫలితం మాకు అనుకూలంగా రాలేదు. కానీ ఈ సీజన్ నుంచి చాలా పాజిటివ్లతో వెళ్తున్నాం. అదే సమయంలో చాలా విషయాల్లో ఇంప్రూవ్ అవ్వాలని కూడా అర్థం చేసుకున్నాం. నెక్స్ట్ సీజన్లో మరింత బలంగా రెడీ అవుతాం' అని చెప్పాడు.
'ప్రపంచంలోని బెస్ట్ లీగ్ టాప్-4లో ఉండాలంటే.. మూడు విభాగాల్లోనూ రాణించాల్సి ఉంటుంది. మాకు ఆ సత్తా ఉండి కూడా టాప్-4లోకి వెళ్లనందుకు చాలా బాధగా ఉంది. మా పరపాట్లపై పని చేసి వచ్చే సీజన్లో సత్తా చాటుతాం. ఈ సీజన్లో ఆడిన 14 మ్యాచుల్లో రింకూ గురించి మాట్లాడినట్లే అనిపిస్తోంది. అతను మైదానంలో ఏం చెయ్యగలడో ప్రపంచం మొత్తం చూసింది. అతని గురించి చెప్పడానికి ఏం లేదు. వ్యక్తిగతంగా అతని ఆట చూసి చాలా సంతోషిస్తున్నా' అని రాణా పేర్కొన్నాడు.