ఈ ఐపీఎల్ సీజన్లో అందరి దృష్టి ఆకర్షించిన ప్లేయర్ రింకూ సింగ్. కేకేఆర్ తరఫున అద్భుతంగా రాణించిన అతను.. ఎన్నో కీలకమైన ఇన్నింగ్సులు ఆడాడు. చివరి లీగ్ మ్యాచ్లో కూడా లక్నోపై కోల్కతాను గెలిపించినంత పని చేశాడీ యువ ప్లేయర్. ఈ క్రమంలో తనకు దక్కిన గుర్తింపు గురించి ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
ఈ సీజన్లో 14 మ్యాచులు ఆడిన రింకూ 149.52 స్ట్రైక్ రేటు, 59.25 సగటుతో 474 పరుగులు చేశాడు. చివరగా లక్నోను ప్లేఆఫ్స్ రేసు నుంచి తోసేసినంత పని చేశాడు. ఈ మ్యాచ్లో కేవలం 33 బంతుల్లోనే 67 పరుగులతో అజేయంగా నిలిచాడు. ఈ మ్యాచ్ అనంతరం మాట్లాడిన రింకూ.. తనకు గుర్తింపు రావడం గురించి మాట్లాడాడు.

'నా కుటుంబం కూడా సంతోషంగానే ఉంది. గతేడాది లక్నోపై నేను మంచి ఇన్నింగ్స్ ఆడినప్పటి నుంచి నాకు గుర్తింపు దొరికింది. కానీ గుజరాత్పై ఐదు సిక్సర్లు బాదినప్పటి నుంచి నాకు చాలా గౌరవం కూడా దక్కింది. నన్ను ఎంతో మంది గుర్తించడం చాలా సంతోషంగా ఉంది' అని చెప్పాడు. లక్నోపై గతేడాది 15 బంతుల్లోనే 40 పరుగులు చేసిన రింకూ అందరి దృష్టినీ ఆకర్షించాడు.
ఈ సీజన్లో గుజరాత్పై యష్ దయాళ్ బౌలింగ్లో చివరి ఓవర్లో ఏకంగా ఐదు సిక్సర్లు బాది కోల్కతాను గెలిపించాడు. 'నేను బ్యాటింగ్ చేసే సమయంలో ఆ ఐదు సిక్సులు ఎప్పుడూ నాకు గుర్తొస్తూనే ఉంటాయి. నేను చాలా రిలాక్స్డ్గా ఉన్నా. నేను ఎప్పుడూ ఆడుతున్నట్లే ఆడాలని అనుకున్నా. చివరి ఓవర్లో 21 పరుగులు చేయాల్సి ఉంది. నేను ఒక బాల్ మిస్సయ్యా. లేదంటే కచ్చితంగా గెలిచేవాళ్లం' అన్నాడు.
అతను అదరగొట్టినా కూడా ఈ మ్యాచ్లో కేకేఆర్ గెలవలేదు. అంతేకాదు, ఈ సీజన్లో రింకూ బ్యాటింగ్ చూసిన చాలా మంది అతన్ని టీమిండియాకు ఎంపిక చేయాలని అంటున్నారు. అయితే తాను మాత్రం ప్రస్తుతం ఈ ఆలోచన చేయడం లేదని చెప్పాడు. ఇప్పటి వరకు కష్టపడినట్లే ఇకపై కూడా కష్టపడుతూ ఉంటానని అన్నాడు.