
దుబాయ్: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2021లో భాగంగా ఆదివారం సన్రైజర్స్ హైదరాబాద్తో జరిగిన మ్యాచులో కోల్కతా నైట్ రైడర్స్ విజయం సాధించింది. ఓపెనర్ శుభ్మన్ గిల్ (57; 51 బంతుల్లో 10×4) కీలక ఇన్నింగ్స్ ఆడడంతో ఆదివారం 6 వికెట్ల తేడాతో సన్రైజర్స్ హైదరాబాద్పై గెలిచింది. స్టార్ ప్లేయర్ నితీష్ రాణా (25; 33 బంతుల్లో 3×4) రాణించడంతో 116 లక్ష్యాన్ని కోల్కతా 19.4 ఓవర్లలో 4 వికెట్లు కోల్పోయి ఛేదించింది. ఈ విజయంతో మిగిలి ఉన్న ఏకైక ప్లే ఆఫ్స్ స్థానాన్ని చేజిక్కించుకునే దిశగా కోల్కతా మరో అడుగేసింది. ఆరో విజయంతో తన అవకాశాలను మరింత మెరుగుపర్చుకుంది. ఇంకో మ్యాచ్ గెలిస్తే కోల్కతా ప్లే ఆఫ్స్ వెళ్లే అవకాశం ఉంది.
అయితే ఈ మ్యాచులో ఓ సంఘటన చోటు చేసుకుంది. కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ నితీశ్ రాణా కొట్టిన షాట్కు మైదానంలోని బౌండరీ లైన్ అవతల ఉన్న కెమెరా లెన్స్ బద్దలైంది. ఈ సంఘటన 18వ ఓవర్లో చోటుచేసుకుంది. కోల్కతా ఛేదనలో జాసన్ హోల్డర్ వేసిన 17.4 ఓవర్కు రాణా డీప్ మిడ్-వికెట్లో ఒక ఫోర్ కొట్టాడు. ఆ బంతి కాస్తా బౌండరీ లైన్ అవతల ఉన్న కెమెరాకు తగలడంతో లెన్స్ పగిలిపోయింది. ఆ బంతిని రషీద్ ఖాన్ ఆపడానికి ప్రయత్నించినా కుదరలేదు. అందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సమాజిక మాధ్యమాల్లో చక్కర్లు కొడుతోంది.
అయితే నితీశ్ రాణా బలమైన కొట్టిన షాట్ బాదడంతో బంతిని బౌండరీ వెళ్లకుండా ఆపడం రషీద్ ఖాన్ వల్ల కాలేదు. ఇక బంతిని మైదానంలోకి విసిరిన రషీద్... పగిలిన కెమెరాలో వేలు పెట్టి చూశాడు. అనంతరం చేతులతో సైగలు చేస్తూ.. ఎస్ఆర్హెచ్ ఆటగాళ్లను చూస్తూ నవ్వుకున్నాడు. దీనికి సంబంధించిన వీడియో నెట్టింట వైరల్గా మారింది. వీడియో చూసిన ఫాన్స్ తమదైన శైలిలో స్పందిస్తున్నారు. 'రషీద్ ఖాన్.. ఏంటా ఆ పని' అని ఒకరు ట్వీట్ చేయగా.. 'రషీద్ ఖాన్.. చిలిపి' అని ఇంకొకరు ట్వీటారు. 116 పరుగుల లక్ష్య ఛేదనలో నితీష్ రాణా కీలకమైన ఇన్నింగ్స్ ఆడాడు. 33 బంతుల్లో 25 పరుగులు చేసి అమూల్యమైన పరుగులు సమకూర్చాడు.
టాస్ గెలిచి బ్యాటింగ్ ఎంచుకున్న సన్రైజర్స్ జట్టు బ్యాటింగ్కు కష్టంగా ఉన్న పిచ్పై పరుగుల కోసం చెమటోడ్చింది. పేసర్ టీమ్ సౌథీతో పాటు స్పిన్నర్లు చెలరేగారు. దాంతో 10 ఓవర్లు ముగిసే సరికి సాహా, రాయ్, విలియమ్సన్ వికెట్లు కోల్పోయి 51 పరుగులు మాత్రమే చేసింది సన్రైజర్స్. క్రమం తప్పకుండా వికెట్లు కోల్పోతూ సన్రైజర్స్ చివరి వరకూ ఇబ్బందిపడింది. ప్రియం గార్గ్ (21; 31 బంతుల్లో 1×6), సమద్ (25; 18 బంతుల్లో 3×6) కాస్త రాణించడంతో సన్రైజర్స్ స్కోరు వంద దాటింది. స్వల్ప లక్ష్యమే అయినా ఛేదనలో కోల్కతా కూడా ఇబ్బంది పడింది. 10 ఓవర్లు ముగిసేసరికి 2 వికెట్లు కోల్పోయి 44 పరుగులే చేసింది. ఆ దశలో గిల్ గేర్ మార్చాడు. మెరుపు షాట్లతో జట్టును విజయానికి చేరువ చేశాడు. చివరలో దినేశ్ కార్తీక్ (18 నాటౌట్) ధాటిగా ఆడి జట్టును గెలిపించాడు.