జైపూర్: ఐపీఎల్ 2023 సీజన్ తుది దశకు చేరుకుంటోంది. లీగ్ మ్యాచ్లు ముగుస్తోన్నాయి. చిట్టచివరి లీగ్ మ్యాచ్ ఈ నెల 21వ తేదీన జరుగనుంది. బెంగళూరులోని ఎంఏ చిన్నస్వామి స్టేడియంలో జరిగే ఈ ఫైనల్ లీగ్ గేమ్లో రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు-గుజరాత్ టైటాన్స్ ఢీ కొట్టబోతోన్నాయి. ఈలోగా ప్లేఆఫ్స్పై ఓ క్లియర్ పిక్చర్ వచ్చేస్తుంది.
రాజస్థాన్ రాయల్స్పై గురువారం రాత్రి ఈడెన్ గార్డెన్స్లో జరిగిన మ్యాచ్లో ఓటమితో కోల్కత నైట్ రైడర్స్.. ప్లేఆఫ్స్ అవకాశాలను సంక్లిష్టం చేసుకుంది. దాదాపుగా తప్పుకొన్నట్టే. తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కత నిర్ణీత 20 ఓవర్లల్లో ఎనిమిది వికెట్ల నష్టానికి 149 పరుగులు చేయగా.. ఈ టార్గెట్ను రాజస్థాన్ రాయల్స్ 13.1 ఓవర్లలోనే ఛేదించింది. ఆ క్రమంలో ఒక్క వికెట్టే నష్టపోయిందా జట్టు.

ఓపెనర్ యశస్వి జైస్వాల్ మరోసారి దుమ్మురేపాడు. 62 బంతుల్లో అయిదు సిక్సర్లు, 12 ఫోర్లతో 98 పరుగులు చేసి నాటౌట్గా నిలిచాడు. కేప్టెన్ సంజు శాంసన్ 48 పరుగులతో అతనికి తనవంతు సహకారాన్ని అందించాడు. ఈ విజయంతో రాజస్థాన్ రాయల్స్ పాయింట్ల పట్టికలో మూడో స్థానానికి చేరుకుంది. చివరి మూడు మ్యాచ్లల్లో ఎదురైన పరాజయాలకు అడ్డుకట్ట వేసింది. ప్లేఆఫ్స్కు మరింత చేరువైంది.
కోల్కత నైట్ రైడర్స్పై మ్యాచ్లో ఫాస్టెస్ట్ 50ని నమోదు చేశాడు జైస్వాల్. 13 బంతులోనే హాఫ్ సెంచరీ అందుకున్నాడు. ఈ 13 బంతుల్లో మూడు సిక్సర్లు, నాలుగు ఫోర్లు ఉన్నాయి. ఇన్నింగ్ను ఆరంభించిన జైస్వాల్.. తొలి ఓవర్ తొలి రెండు బంతులను సిక్సర్లుగా మలిచాడు. అక్కడ ఆరంభమైన అతని దూకుడు ఇన్నింగ్ చివరి బంతి వరకూ కొనసాగింది. అతణ్ని అవుట్ చేయలేకపోయారు కోల్కత బౌలర్లు.
అతను బ్యాటింగ్ చేసిన తీరును ప్రశంసిస్తూ రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు బ్యాటర్ విరాట్ కోహ్లీ ట్వీట్ చేశాడు. తన ఇన్స్టాగ్రామ్లోనూ దీన్ని పోస్ట్ చేశాడు. దీనికి- జైస్వాల్ ఫొటోను యాడ్ చేశాడు. 13 బంతుల్లో 50 పరుగులు చేసిన స్కోర్ కార్డ్ను చూపించే ఫొటో ఇది. తాను చూసిన బెస్ట్ ఇన్నింగ్స్లల్లో ఇదీ ఒకటి అంటూ ప్రశంసించాడు. దీన్ని పోస్ట్ చేసిన కొద్దిసేపటికే ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్ నుంచి ఆ ఫొటోను విరాట్ కోహ్లీ తొలగించాడు.
దీనికి కారణం లేకపోలేదు. తన పోస్ట్ కోసం విరాట్ కోహ్లీ వినియోగించిన జైస్వాల్ ఫొటో జియో సినిమాకు సంబంధించింది. ఈ ఫొటో మీద జియో సినిమా అనే బ్రాండ్ నేమ్ కూడా ఉంది. అందుకే అతను హడావుడిగా దీన్ని తొలగించాల్సి వచ్చింది. ఈ ఐపీఎల్ సీజన్ కోసం విరాట్ కోహ్లీ స్టార్ స్పోర్స్ట్కు బ్రాండ్ అంబాసిడర్గా వ్యవహరిస్తోన్న విషయం తెలిసిందే.
అలాంటి విరాట్ కోహ్లీ- జియో సినిమాను ప్రమోట్ చేసేలా తన అధికారిక ట్విట్టర్, ఇన్స్టాగ్రామ్లల్లో జియో సినిమా పేరు ఉన్న ఫొటోను పోస్ట్ చేయడం వల్ల వివాదం తలెత్తుతుందని భావించాడు. అందుకే దాన్ని అప్పటికప్పుడు తొలగించాడు. అతను తొలగించేటప్పటికే పరిస్థితి మించిపోయింది. దీనికి సంబంధించిన స్క్రీన్ షాట్ ఒకటి సోషల్ మీడియాలో వైరల్గా మారింది.