
ముంబై: ఐపీఎల్ 2022 సీజన్ సెకెండ్ హాఫ్ రసవత్తరంగా సాగుతోంది. అయిదు పరాజయాల తరువాత కోల్కత నైట్రైడర్స్ తొలి మ్యాచ్ గెలిచింది. తన పరాజయాల పరంపరకు తెర దించింది. సోమవారం రాత్రి వాంఖెడె స్టేడియంలో జరిగిన మ్యాచ్లో రాజస్థాన్ రాయల్స్ను ఓడించింది. ఈ టోర్నమెంట్లో కోల్కతకు ఇది నాలుగో గెలుపు. ఇప్పటివరకు 10 మ్యాచ్లల్లో శ్రేయాస్ అయ్యర్ సారథ్యంలోని ఈ జట్టు గెలిచింది నాలుగే. పాయింట్ల పట్టికలో ఏడో స్థానంలో కొనసాగుతోందీ టీమ్.
తొలుత బ్యాటింగ్ చేసిన రాజస్థాన్ రాయల్స్ నిర్ణీత 20 ఓవర్లల్లో అయిదు వికెట్ల నష్టానికి 152 పరుగులు చేసింది. కేప్టెన్ సంజు శాంసన్ ఒక్కడే హాఫ్ సెంచరీతో రాణించాడు. ఓపెనర్ జోస్ బట్లర్ 22 పరుగులకే పరిమితం అయ్యాడు. షిమ్రోన్ హెట్మయిర్ 27 పరుగులు చేశాడు. హెట్మెయిర్ 13 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో మెరుపులు మెరిపించక పోయి ఉంటే ఆ స్కోర్ కూడా దక్కేది కాదు. రియాన్ పరాగ్ అతని దూకుడుకు తోడయ్యాడు. 12 బంతుల్లో రెండు సిక్సర్లు, ఒక ఫోర్తో 19 పరుగులు చేశాడు.
ఈ లక్ష్యాన్ని కోల్కత ఛేదించింది. అయిదు బంతులు మిగిలివుండగానే 158 పరుగులు చేసింది. ఓపెనర్లు విఫలమైనప్పటికీ.. టాప్ ఆర్డర్, మిడిల్ ఆర్డర్లో కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్, నితీష్ రాణా, రింకూ సింగ్ రాణించారు. నితీష్ రాణా-రింకూసింగ్ క్రీజ్లో పాతుకునిపోయి.. జట్టుకు విజయాన్ని అందించారు. వికెట్ నష్టపోకుండా 66 పరుగుల భాగస్వామ్యాన్ని అందించారు. నితీష్ రాణా 37 బంతుల్లో రెండు సిక్సర్లు, మూడు ఫోర్లతో 48, రింకూ సింగ్ 23 బంతుల్లో ఒక సిక్సర్, ఆరు ఫోర్లతో 42 పరుగులు చేసి నాటౌట్గా నిలిచారు.
ఈ మ్యాచ్లో రింకూ సింగ్ బ్యాటింగ్ ఆకట్టుకుంది. చివరి మూడు మ్యాచ్లల్లో వందకు పైగా స్ట్రైక్ రేట్తో 35, 23, 42 (నాటౌట్) పరుగులు చేశాడు. ఈ మ్యాచ్లో హాఫ్ సెంచరీ చేయాలని, ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్గా నిలవాలని నిర్ణయించుకున్నాడు. దాన్ని చేతి మీద రాసుకుని మరీ క్రీజ్లోకి ఎంట్రీ ఇచ్చాడు. అనుకున్నది సాధించాడు. ప్లేయర్ ఆఫ్ ది మ్యాచ్ అతనికే సొంతమైంది. ఇలాంటి అవకాశం కోసం తాను అయిదు సంవత్సరాలుగా ఎదురు చూశానని చెప్పాడు. లభించిన అవకాశాన్ని సద్వినియోగం చేసుకున్నానని పేర్కొన్నాడు.
హెడ్ కోచ్ బ్రెండన్ మెక్కల్లమ్, కేప్టెన్ శ్రేయాస్ అయ్యర్ ప్రశంసలను అందుకున్నాడీ 24 సంవత్సరాల క్రికెటర్. సైలెంట్గా తన పని తాను చేసుకుంటూపోతుంటాడని, ఇప్పడూ అదే పని చేశాడని శ్రేయాస్ అయ్యర్ చెప్పాడు. భవిష్యత్తులో మరిన్ని మ్యాచ్ల్లో రింకూసింగ్ కీలక పాత్ర పోషిస్తాడని కితాబిచ్చాడు. రింకూ సింగ్కు ఇది ప్రారంభం మాత్రమేనని, అతనికి ఉజ్వల భవిష్యత్ ఉందని మెక్కల్లమ్ చెప్పాడు. జట్టులో కీలక ఆటగాడిగా మారాడని వ్యాఖ్యానించాడు.