ఐపీఎల్ 2025 ఓపెనింగ్ సెర్మనీ గ్రాండ్గా జరిగింది. కోల్కతా నైట్ రైడర్స్ ఓనర్, బాలీవుడ్ స్టార్ షారుఖ్ఖాన్ యాంకరింగ్, దిశాపటానీ చిందు, శ్రేయా ఘోషల్ పాట, ఆర్సీబీ స్టార్ విరాట్ కోహ్లీ, కేకేఆర్ రైజింగ్ స్టార్ రింకూ సింగ్ డ్యాన్స్ లతో ఈ కార్యక్రమం అట్టహాసంగా సాగింది. దీనికి సంబంధించిన వీడియోలు సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టగా, అభిమానులు వాటిని షేర్ చేస్తూ సంబరాలు చేసుకున్నారు.
కొత్త కాంట్రవర్సీ...
అయితే ఈ వీడియోల్లో కనిపించిన ఓ సంఘటన ప్రస్తుతం కాంట్రవర్సీకి దారీ తీసింది. షారుక్ తో కలిసి కోహ్లీ, రింకూ సింగ్ డ్యాన్స్ వేసిన సంగతి తెలిసిందే. అంతకన్నా ముందు కోహ్లీతో స్టేజ్ పై ఉన్న షారుక్ ఖాన్.. రింకూ సింగ్ ను వేదికపైకి ఆహ్వానించారు. ఆ సమయంలో స్టేజ్ పైకి వచ్చిన రింకూ సింగ్.. షారుక్ ఖాన్ కు హగ్, షేక్ హ్యాండ్ ఇచ్చాడు. కానీ ఆ తర్వాత కోహ్లీ షేక్హ్యాండ్ ఇచ్చేందుకు ప్రయత్నించగా.. రింకూ సింగ్ దాన్ని పట్టించుకోకుండా ముందుకు వెళ్లిపోయినట్లు వీడియోలో కనిపించింది. దీంతో రింకూ సింగ్.. కోహ్లీని అవమానించాడంటూ కొత్త వివాదం మొదలైంది.

మర్యాద ఇవ్వలేదా - అనుకోకుండా జరిగిందా?
అయితే రింకూ సింగ్.. ఉద్దేశపూర్వకంగా కోహ్లీకి షేక్హ్యాండ్ ఇవ్వలేదా? లేదంటే గమనించకుండానే వెళ్లిపోయాడా? అని క్రికెట్ అభిమానులు తెగ చర్చించుకుంటున్నారు. కోహ్లీకి మర్యాద ఇవ్వలేదంటూ కొందరూ రింకూ సింగ్ ను విమర్శిస్తుండగా.. మరి కొంతమంది మాత్రం రింకూ సింగ్ కు మద్దతుగా నిలుస్తున్నారు. అది అనుకోకుండా జరిగి ఉంటుందని కామెంట్లు చేస్తున్నారు. వాస్తవానికి కోహ్లీ - రింకూ సింగ్ మధ్య మంచి అనుబంధం ఉంది.