Shreyas Iyer: ఐపీఎల్ 2025లో పంజాబ్ కింగ్స్ మంచి ప్రదర్శన చేస్తూ ముందుకెళ్తోంది. ఇప్పటివరకు ఆడిన ఆరు మ్యాచుల్లో నాలుగింటిలో గెలిచి నాలుగో స్థానంలో నిలిచింది. తాజా మ్యాచులో ఏకంగా 112 పరుగుల లక్ష్యాన్ని డిఫెండ్ చేసుకుని 16 పరుగుల తేడాతో గెలిచింది. ఐపీఎల్ చరిత్రలోనే అత్యంత స్వల్ప లక్ష్యాన్ని కాపాడుకున్న జట్టుగా నిలిచింది. దీంతో పంజాబ్ జట్టుపై ప్రశంసలు కురుస్తున్నాయి. జట్టు విజయంలో 4/28తో కీలకంగా వ్యవహరించిన చాహల్ తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ ను క్రికెట్ అభిమానులు తెగ పొగిడేస్తున్నారు. ఈ మ్యాచ్లో శ్రేయస్ అయ్యర్ వ్యూహాత్మక నిర్ణయాలు, బౌలర్ల నైపుణ్యం జట్టుకు కీలకమైన విజయాన్ని అందించాయని అంటున్నారు. ఈ నేపథ్యంలో మ్యాచ్ విజయం అనంతరం శ్రేయస్ అయ్యర్ ఆసక్తికర వ్యాఖ్యలు చేశాడు.
అలా చేయమని చెప్పా..
"ఈ విజయన్ని మాటల్లో వ్యక్తపరచడం కష్టం. నేను కేవలం నా ఆలోచనలను అనుసరించాను. బంతి కాస్త స్పిన్ అవ్వడం గమనించాను. వెంటనే చాహల్ దగ్గరికి వెళ్లి శ్వాస కాస్త నియంత్రించుకోమని చెప్పాను. మేము అప్పుడు దాడి చేయాల్సిన అవసరం ఉంది. అందుకే సరైన ఆటగాళ్ళను సరైన స్థానాల్లో ఉండటం ద్వారా ఒత్తిడి తీసుకొచ్చాం. ఇప్పుడు కూడా మాటలు రావడం లేదు. ఇలాంటి విజయాలు ఎంతో ప్రత్యేకం. నేను బ్యాటింగ్కు వెళ్లినప్పుడు, కేవలం రెండు బంతులు ఎదుర్కొన్నాను. ఒక బంతి తక్కువ ఎత్తులో వచ్చింది. మరొక బంతి బ్యాట్ కింద భాగాన్ని తాకింది. స్వీప్ షాట్ ఆడటం బ్యాటర్లకు కష్టంగా ఉంది. 16 పరుగుల తేడాతో గెలిచాం. అంటే వాస్తవానికి మేం డీసెంట్ స్కోర్ చేశామనే భావిస్తున్నాను. పిచ్లో బౌన్స్ స్థిరంగా లేదు. ఈ విషయాన్ని బౌలర్లకు చెప్పాను. వారు దాన్ని అమలు చేసి అద్భుతంగా బౌలింగ్ చేశారు."
