KKR vs PBKS: ఐపీఎల్-2025లో భాగంగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన కోల్కతా నైట్రైడర్స్ వర్సెస్ పంజాబ్ కింగ్స్ మ్యాచు జరిగింది. ఈ పోరులో మొదట బ్యాటింగ్ కు దిగిన పంజాబ్ లో ఓపెనర్లు ప్రియాంశ్ ఆర్య (69), ప్రభ్సిమ్రన్ సింగ్ (83)లు తమ ప్రదర్శనతో హైలైట్ గా నిలిచారు. అయితే ఈ క్రమంలోనే ప్రభ్సిమ్రన్ సింగ్ ఓ అరుదైన రికార్డు సాధించాడు. అదేంటంటే..
ప్రభ్సిమ్రన్ సింగ్ 49 బంతుల్లో 169 స్ట్రైక్ రేటుతో 6 ఫోర్లు, 6 సిక్సుల సాయంతో 83 పరుగులు బ్రిలియంట్ ఇన్నింగ్స్ ఆడాడు. మొదటి 32 బంతుల్లో 34 పరుగులు చేసిన అతడు... చివరి 17 బంతుల్లో ఏకంగా 49 పరుగులు సాధించాడు. కానీ సెంచరీకి దగ్గరగా వచ్చి పెవిలియన్ చేరాడు. ఈ క్రమంలోనే అతడు పంజాబ్ కింగ్స్ తరఫున 1000 పరుగులు సాధించిన తొలి అన్ క్యాప్డ్ బ్యాటర్ గానూ నిలిచాడు.

గంతులేసిన ప్రీతి జింటా..
ఈ మ్యాచులో పంజాబ్ కింగ్స్ నాలుగో ఓవర్ ముగిసేసరికి ప్రభ్ సిమ్రన్ సింగ్ 13 పరుగులు చేశాడు. అయితే ఐదో ఓవర్ లో అతడు రిథమ్ అందుకున్నాడు. అక్కడి నుంచి దూకుడు కొనసాగిస్తూ బౌండరీలు, సిక్సులు బాదాడు.ఈ క్రమంలోనే నరైన్ బౌలింగ్ లో ఓ భారీ సిక్సును బాదాడు ప్రభ్ సిమ్రాన్. అది కాస్త డీప్ ఎక్స్ ట్రా కవర్ మీదుగా 77 మీటర్ల సిక్స్ వెళ్లింది. దీంతో ఒక్కసారిగా స్టాండ్స్ లో ఉన్న పంజాబ్ ఓనర్ ప్రీతి జింటా దెబ్బకు షాక్ అయిపోయింది. నోరు తెరుచుకుని కేరింతలు కొడుతూ ఆనందం వ్యక్తం చేసింది. కాగా, పటియాలాకు చెందిన ప్రభ్ సిమ్రన్ సింగ్ టాప్ ఆర్డర్లో తన స్థానాన్ని స్థిరపరుచుకుని, జట్టుకు కీలక ఆటగాడిగా మారాడు. తమ తొలి టైటిల్ గెలవాలనే లక్ష్యంతో ఈ సీజన్ లో ముందుకు సాగుతున్న పంజాబ్ కింగ్స్ కూడా.. ఎక్కువగా ఇతడి ప్రదర్శనపైనే ఆధారపడుతోంది.
ఇకపోతే ఈ మ్యాచులో మొదట టాస్ గెలిచి బ్యాటింగ్కు దిగిన పంజాబ్ నిర్ణీత 20 ఓవర్లలో 4 వికెట్ల నష్టానికి 201 పరుగులు చేసింది. ప్రియాంశ్ ఆర్య (69), ప్రభ్సిమ్రన్ సింగ్ (83)తో పాటు కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ (25*), ఇంగ్లిస్ (11*) పరుగులు చేశారు. మ్యాక్స్వెల్ (7), మార్కో యాన్సెన్ (3) నిరాశపరిచారు. కోల్కతా బౌలర్లలో వైభవ్ అరోరా రెండు, వరుణ్ చక్రవర్తి, రస్సెల్ తలో వికెట్ తీశారు.