
పంజాబ్ కింగ్స్తో మ్యాచ్లో కోల్కతా నైట్ రైడర్స్ బ్యాటర్ ఆండ్రూ రసెల్ దుమ్ములేపాడు. భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. రసెల్ విధ్వంసం ధాటికి కోల్కతా మరో 33 బంతులు మిగిలి ఉండగానే 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది. 31 బంతుల్లోనే రసెల్ 70 పరుగులు బాదేశాడు. అతని ఇన్నింగ్స్లో 8 సిక్సర్లు, 2 ఫోర్లు ఉన్నాయి. స్ట్రైక్రేట్ 225గా ఉంది. అలాగే ఆరెంజ్ క్యాప్ కూడా అందుకున్నాడు. అంతకుముందు ఉమేష్ యాదవ్ బౌలింగ్లో చెలరేగడంతో పంజాబ్ 137 పరుగులకే ఆలౌటైంది. 4 వికెట్లతో చెలరేగిన ఉమేష్ యాదవ్ పర్పుల్ క్యాప్ అందుకున్నాడు.
టాస్ ఓడి మొదట బ్యాటింగ్ చేసిన పంజాబ్ కింగ్స్ 137 పరుగులకే ఆలౌటైంది. పవర్ ప్లేలోనే 3 వికెట్లు కోల్పోయిన ఆ జట్టు 10 ఓవర్లు ముగిసే సమయానికే సగం వికెట్లు కోల్పోయింది. ఈ క్రమంలో కనీసం 100 పరుగులు చేయడం కూడా అనుమానంగా మారింది. కానీ చివర్లో కగిసో రబాడ మెరుపులు మెరిపించడంతో పంజాబ్ స్కోర్ 137కు చేరుకుంది. పంజాబ్ బ్యాటర్లలో రాజపక్సే 31, రబాడ 25, లివింగ్ స్టోన్ 19, ధావన్ 16, హర్ప్రీత్ బ్రార్ 14, రాజ్ బవా 11 మాత్రమే రెండెంకెల స్కోర్ చేశారు. కోల్కతా బౌలర్లలో ఉమేష్ యాదవ్ 4, టిమ్ సౌథీ 2, రసూల్, సునీల్ నరైన్, శివమ్ మావి తలో వికెట్ తీశారు.
అనంతరం 138 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కోల్కతా నైట్ రైడర్స్ టాపార్డర్ వైఫల్యంతో 51 పరుగులకే 4 వికెట్లు కోల్పోయి కష్టాల్లో పడింది. అయితే ఈ క్రమంలో బ్యాటింగ్కు వచ్చిన రసెల్ కేకేఆర్ను ఆదుకున్నాడు. భారీ సిక్సర్లతో పంజాబ్ బౌలర్లపై విరుచుకుపడ్డాడు. ఈ క్రమంలో 26 బంతుల్లోనే హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. చివరి 33 బంతులు మిగిలి ఉండగానే సిక్సుతో కేకేఆర్కు విజయాన్ని అందించాడు. దీంతో పంజాబ్పై కేకేఆర్ 6 వికెట్ల తేడాతో గెలిచింది. ఈ విజయంతో పాయిట్ల టేబుల్లో కేకేఆర్ రెండు విజయాలతో మొదటి స్థానానికి చేరుకుంది. కేకేఆర్ బ్యాటర్లలో రసెల్ 70*, శ్రేయస్ 26, బిల్లింగ్స్ 24*, రహానే 12, వెంకటే్ 3 పరుగులు చేశారు. పంజాబ్ బౌలర్లలో రాహుల్ చాహర్ 2, రబాడ, స్మిత్ తలో వికెట్ తీశారు. ఉమేష్ యాదవ్కు మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అవార్డు దక్కింది.
స్కోర్లు:
పంజాబ్: 137 ఆలౌట్
కోల్కతా: 141-4.