అబుదాబి: ఐపీఎల్ 13వ సీజన్లో భాగంగా కోల్కతా నైట్రైడర్స్తో జరుగుతున్న మ్యాచ్లో ముంబై ఇండియన్స్ దూకుడుగా ఆడుతున్నది. ముంబై ఓపెనర్, హిట్మ్యాన్ రోహిత్ శర్మ ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డాడు. హిట్మ్యాన్ ఇప్పటికే 5 సిక్సులు బాదాడు. మరోవైపు సూర్య కుమార్ ధనాధన్ బ్యాటింగ్తో చెలరేగుతున్నాడు. పవర్ప్లే ముగిసేసరికి 59 పరుగులు రాబట్టారు. రోహిత్ ధాటిగా ఆడుతూ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ మార్క్ అందుకున్నాడు. కుల్దీప్ యాదవ్ వేసిన 12వ ఓవర్ చివరి బంతికి రెండు పరుగులు తీసిన రోహిత్.. అర్ధ శతకం చేశాడు.
టాస్ ఓడి బ్యాటింగ్కు దిగిన ముంబైకి ఆదిలోనే షాక్ తగిలింది. ఇన్నింగ్స్ రెండో ఓవర్లోనే స్టార్ ఓపెనర్ క్వింటన్ డికాక్ వికెట్ను ముంబై కోల్పోయింది. యువ పేసర్ శివమ్ మావి వేసిన తన తొలి ఓవర్లోనే డికాక్ను పెవిలియన్ పంపాడు. రెండో ఓవర్ రెండో బంతిని భారీ షాట్ ఆడేందుకు డికాక్ యత్నించగా.. బంతి టాప్ ఎడ్జ్ తీసుకొని మిడ్వికెట్లో గాల్లోకి లేచింది. అక్కడే ఫీల్డింగ్ చేస్తున్న నిఖిల్ నాయక్ క్యాచ్ అందుకున్నాడు. ఐపీఎల్లో శివమ్ మావికి ఇదే తొలి వికెట్ కావడం విశేషం.
డికాక్ అనంతరం సూర్యకుమార్ యాదవ్ క్రీజులోకి వచ్చాడు. రోహిత్ శర్మ, సూర్యకుమార్ ఇద్దరూ ధనాధన్ బ్యాటింగ్తో అలరించారు. ఫోర్లు, సిక్సులతో విరుచుకుపడ్డారు. మూడో ఓవర్ వేసిన వారియర్ బౌలింగ్లో సూర్యకుమార్ ఏకంగా నాలుగు ఫోర్లు బాది 16 పరుగులు రాబట్టాడు. ఆ తర్వాత ప్రతీ ఓవర్లో 10 పరుగులు తగ్గకుండా రన్స్ చేశారు. ఈ జోడీ ధాటికి కోల్కతా యాజమాన్యం భారీ ధర పెట్టి కోలుకున్న పాట్ కమిన్స్ సైతం తేలిపోయాడు. పవర్ప్లే ముగిసేసరికి 59 పరుగులు రాబట్టారు. క్రీజులో కుదురుకున్న జోడీని విడదీసేందుకు కోల్కతా బౌలర్లు శ్రమించారు.
ధాటిగా ఆడే క్రమంలో సూర్యకుమార్ హాఫ్ సెంచరీ ముందర ఔట్ అయ్యాడు. సునీల్ నరైన్ వేసిన పదకొండో ఓవర్ అయిదో బంతికి రోహిత్ సింగిల్ తీయగా.. మరో పరుగు కోసం ప్రయత్నిస్తూ యాదవ్ (47) రనౌట్ అయ్యాడు. రోహిత్, యాదవ్ జోడీ 90కి పైగా పరుగుల భాగస్వామ్యాన్ని నెలకొల్పింది. ఆపై రోహిత్ 39 బంతుల్లో హాఫ్ సెంచరీ చేశాడు. అనంతరం సౌరవ్ తివారి అలరించాడు. భారీ షాట్ ఆడే క్రమంలో క్యాచ్ ఔట్ అయ్యాడు. అయితే రోహిత్ మాత్రం తన దూకుడు ఆపట్లేదు. అతనికి హార్దిక్ పాండ్యా తోడవ్వడంతో ముంబై స్కోర్ పరుగులు పెడుతోంది.