ఈడెన్ గార్డెన్స్ వేదికగా శనివారం కోల్కతా నైట్ రైడర్స్తో జరిగిన మ్యాచ్లో ముంబై ఇండియన్స్ 18 పరుగుల తేడాతో పరాజయాన్ని చవిచూసింది. ఇప్పటికే టోర్నీ నుంచి ఎలిమినేట్ అయిన ముంబైకి ఈ సీజన్లో తొమ్మిదో ఓటమి. మరోవైపు 12 మ్యాచ్ల్లో తొమ్మిది గెలిచిన కేకేఆర్ ప్లేఆఫ్స్కు అర్హత సాధించింది. ఐపీఎల్-2024లో తదుపరి దశకు చేరిన తొలి జట్టుగా కోల్కతా నిలిచింది.
అయితే వర్షం కారణంగా 16 ఓవర్లకు కుదించిన ఈ మ్యాచ్లో ఓ దశలో ముంబై ఇండియన్స్ విజయం దిశగా దూసుకెళ్లింది. కానీ కేకేఆర్ స్పిన్నర్లు గొప్పగా పోరాడి జట్టుకు విజయాన్ని అందించారు. టాస్ ఓడి తొలుత బ్యాటింగ్ చేసిన కోల్కతా 16 ఓవర్లలో ఏడు వికెట్లకు 157 పరుగులు చేసింది. వెంకటేశ్ అయ్యర్ (42; 21 బంతుల్లో, 6x4,2x6) టాప్ స్కోరర్. బుమ్రా (2/39), పీయూష్ చావ్లా (2/28) చెరో రెండు వికెట్లు తీశారు.

అనంతరం ఛేదనకు దిగిన ముంబై ఇండియన్స్ 16 ఓవర్లలో ఎనిమిది వికెట్లు కోల్పోయి 139 పరుగులకే పరిమితమైంది. ఇషాన్ కిషన్ (40; 22 బంతుల్లో, 5x4, 2x6), తిలక్ వర్మ (32; 17 బంతుల్లో, 5x4, 1x6) పోరాడారు. వరుణ్ చక్రవర్తి (2/17), రసెల్ (2/34), హర్షిత్ రాణా (2/34) తలో రెండు వికెట్లు తీశారు.
అయితే ముంబై 5 ఓవర్లకు 59/0 స్కోరుతో పటిష్ట స్థితిలో నిలిచింది. కానీ ఆ తర్వాత వరుణ్, నరైన్ బంతిని అందుకోవడంతో మంబై కథ మారిపోయింది. వరుసగా వికెట్లు కోల్పోయి ఓటమిని చవిచూసింది. మ్యాచ్ అనంతరం ముంబై ఇండియన్స్ కెప్టెన్ హార్దిక్ పాండ్య ఓటమికి గల కారణాలు వివరించాడు. గొప్ప ఆరంభాన్ని సద్వినియోగం చేసుకోలేకపోవడమే తమ జట్టు ఓటమికి ప్రధాన కారణమని పేర్కొన్నాడు.
''ఇది చాలా కఠినమైనది. ఛేదనలో మాకు శుభారంభం దక్కింది. కానీ దాన్ని కొనసాగించలేకపోయాం. వికెట్ భిన్నమైనది. ఇక్కడ బ్యాటింగ్లో జోరు అందుకోవడం చాలా ముఖ్యం. అది దక్కినప్పటికీ సద్వినియోగం చేసుకోలేకపోయాం. అది ఛేదించగలిగే లక్ష్యమే. బౌలర్లు గొప్పగా పోరాడారు''
''బంతి బౌండరీకి వెళ్లిన తర్వాత, అక్కడ కవర్లను తాకి తడి అవుతుంది. అయినా వాళ్లు రాణించారు. ఇక చివరి మ్యాచ్లో మంచి క్రికెట్ ఆడాలనుకుంటున్నాం. ఆది నుంచి మా ఆలోచన అదే, కానీ అలా ఆడలేకపోయాం'' అని హార్దిక్ అన్నాడు. మే 17న వాంఖడే వేదికగా లక్నో సూపర్ జెయింట్స్తో ముంబై ఈ సీజన్లో ఆఖరి మ్యాచ్ ఆడనుంది.