Sai Sudharsan: ఈ ఐపీఎల్ 2025 సీజన్ లో గుజరాత్ టైటాన్స్ ఆడే మ్యాచులు చూస్తోన్న క్రికెట్ అభిమానులు.. సాయి సుదర్శన్ ఆట చూసి ఆశ్చర్యపోతున్నారు. ఎందుకంటే ఈ సీజన్ లో భారత్ తరఫున అత్యధిక పరుగుల వీరుడు కోహ్లీనో, రాహులో, శుభ్మనో కాదు.. సాయి సుదర్శనే అత్యధిక పరుగులు సాధించాడు. అతడు నిలకడగా ఆడుతూ మరో మిస్టర్ కన్సిస్టెంట్గా పేరు సంపాదించుకున్నాడు.
తాజా మ్యాచులోనూ మరో ఫిఫ్టీ..
తాజాగా కోల్కతా నైట్ రైడర్స్తో (KKR VS GT) జరిగిన మ్యాచులోనూ సాయి సుదర్శన్ తన అద్భుత ప్రదర్శనతో ఆకట్టుకున్నాడు. హాఫ్ సెంచరీ బాది క్రికెట్ అభిమానుల్ని అలరించాడు. మొత్తంగా 36 బంతులు ఎదుర్కొన్న అతడు 6 ఫోర్లు, ఒక సిక్స్ సాయంతో 52 పరుగులు చేశాడు. రస్సెల్ వేసిన 12.2 ఓవర్ దగ్గర వికెట్ కీపర్ గుర్బాజ్ కు క్యాచ్ ఇచ్చి పెవిలియన్ చేరాడు. దీంతో గిల్ తో కలిసి మంచి ఇన్నింగ్స్ నిర్మించిన అతడు ఔట్ అవ్వడంతో.. 114 పరుగుల ఓపెనింగ్ భాగస్వామ్యానికి తెరపడింది.

8 మ్యాచుల్లో 5 సార్లు..
ఈ గుజరాత్ టైటాన్స్ ఓపెనర్ 8 మ్యాచ్ల్లోనే 52.13 సగటుతో 417 పరుగులు సాధించాడు. అందులో ఐదు అర్ధ శతకాలు ఉండటం విశేషం. ఈ సీజన్ లో తాను ఆడిన తొలి మ్యాచ్లో ఫిఫ్టీ, రెండో మ్యాచులో ఫిఫ్టీ, మూడో మ్యాచులో 40, ఐదో మ్యాచులో ఫిఫ్టీ, ఆరో మ్యాచులో ఫిఫ్టీ, ఏడో మ్యాచులో 30, ఇప్పుడు 8వ మ్యాచులో మరో 50 బాది అదరగొట్టాడు.
గత సీజన్లోనే తనదైన ముద్ర..
వాస్తవానికి గత సీజన్లోనే సుదర్శన్ తనదైన ముద్ర వేశాడు. ఈ సారి ఇంకా గొప్పగా రాణిస్తున్నాడు ఈ తమిళనాడు కుర్రాడు. కెప్టెన్ శుభ్మన్ గిల్తో కలిసి టైటాన్స్కు అద్భుత ఆరంభాలనిస్తూ జట్టు విజయాల్లో కీలక పాత్ర పోషిస్తున్నాడు. గుజరాత్ గత 6 మ్యాచ్ల్లో 4 గెలిచిందంటే అందులో సుదర్శన్ పాత్ర ఎంతో కీలకమనే చెప్పాలి.
హై స్పీడులో స్ట్రైక్ రేటు..
ఇకపోతే గత సీజన్లో సుదర్శన్ మంచి ప్రదర్శన చేసినప్పటికీ.. వేగం లేదనే విమర్శలు వినిపించాయి. కానీ ప్రస్తుత సీజన్లో తన దూకుడు పెంచాడు సుదర్శన్. అతడి స్ట్రైక్ రేట్ 152 వరకు ఉండడం విశేషం.