KKR VS GT: ఐపీఎల్ 2025లో భాగంగా తాజాగా ఈడెన్ గార్డెన్స్ వేదికగా జరిగిన మ్యాచులో గుజరాత్ టైటన్స్ పై కోల్కతా నైట్ రైడర్స్ దారుణంగా ఓడిపోయింది. 39 పరుగుల తేడాతో పరాజయం చూసింది. కేకేఆర్ జట్టులో బౌలర్లు మంచి ప్రదర్శనే చేసినా.. బ్యాటర్లంతా చేతులెత్తేశారు. దీంతో ఛేజింగ్ లో కేకేఆర్ కు ఓటమి తప్పలేదు.
199 పరుగుల లక్ష్యంతో బరిలోకి దిగిన కేకేఆర్ జట్టు.. నిర్ణీత 20 ఓవర్లలో 8 వికెట్లు కోల్పోయి 159 పరుగులు మాత్రమే చేసింది. కెప్టెన్ అజింక్యా రహానే (36 బంతుల్లో 5 ఫోర్లు, 1 సిక్స్ సాయంతో 50) అర్ధ శతకం బాదాడు. అతడే జట్టులో టాప్ స్కోరర్. యాండ్రూ రసెల్ (15 బంతుల్లో 3 ఫోర్లు 1 సిక్స్ సాయంతో 21 పరుగులు) కాసేపు దూకుడు ప్రదర్శించి త్వరగా పెవిలియన్ చేరాడు. ఇతడు ఇంకాసేపు రాణించి ఉంటే.. కేకేఆర్ మూమెంట్ దొరికేది. చివర్లో రింకూ సింగ్ (14 బంతుల్లో 1 ఫోర్, 1 సిక్స్ 17 పరుగులు), రఘువంశీ (13 బంతుల్లో 27 నాటౌట్ ) పరుగులు చేశారు. ప్రసిద్ధ్ కృష్ణ, రషీద్ ఖాన్ తలో రెండు వికెట్లు పడగొట్టగా, సిరాజ్, ఇషాంత్ శర్మ, వాష్టింగ్టన్ సుందర్, సాయి కిశోర్ తలో వికెట్ దక్కించుకున్నారు.
అదే మాలో మైనస్..
మ్యాచ్ అనంతరం ఓటమిపై నిరాశ వ్యక్తం చేశాడు కెప్టెన్ అజింక్యా రహానె. అతడు మాట్లాడుతూ... "199 పరుగుల లక్ష్యం ఛేధించదగినదే. బౌలింగ్తో మేము మ్యాచ్లోకి తిరిగి అద్భుతంగా పుంజుకున్నాం. పెద్ద లక్ష్యం ఛేదంచేటప్పుడు, ఓపెనింగ్ లోనే మంచి ఆరంభం అవసరం. అందుకే ఈ టోర్నమెంట్ లో మేం ఇబ్బంది పడుతున్నాం. ఈ పిచ్పై 199 ఛేధించడం సాధ్యమేనని అనిపించింది. బౌలింగ్ అద్భుతంగా చేశాం కానీ, మా బ్యాటింగ్ విఫలమైంది. త్వరగా తప్పులను సరిచేసుకుని, ముందుకు సాగాలి. పిచ్ కాస్త నెమ్మదిగా ఉంది, కానీ 200 కన్నా తక్కువ పరుగులకు వారిని కట్టడి చేస్తే, మాకు అవకాశం కలిసొస్తుందని భావించాం. ఈ పరిస్థితుల గురించి మాకు బాగా తెలుసు. మిడిల్ ఓవర్లలో మేము బాగా ఆడాలి, అదే మా లోపం."
అఖర్లో అతడు సూపర్...
"మా బౌలర్లలో ఎలాంటి లోపం లేదు. వారు బాగా ఆడారు. మైదానంలో 10-15 పరుగులు కాపాడుకోగలిగితే, గేమ్లో తేడా తీసుకురాగలం. ఈ విషయంలో మేము మరింత ఏకాగ్రతతో ఉండాలి. తప్పుల సరిచేసుకుని, మా బ్యాటింగ్ యూనిట్ ధైర్యంగా ఆడాలి. పాజిటివ్ మైండ్సెట్ అవసరం. మిడిల్ ఆర్డర్లో మాకు నాణ్యమైన బ్యాటర్లు ఉన్నారు. వారికి పూర్తి మద్దతు ఇస్తాం. ఆఖర్లో రఘువంశీ బాగా ప్రదర్శన చేశాడు." అని రహానె చెప్పుకొచ్చాడు.
