
అబుదాబి: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) 2020లో భాగంగా ఈ రోజు రాత్రి 7:30 గంటలకు అబుదాబిలోని షేక్ జాయేద్ స్టేడియంలో 8వ మ్యాచ్ జరుగనుంది. ఈ మ్యాచ్లో సన్రైజర్స్ హైదరాబాద్, కోల్కతా నైట్ రైడర్స్ జట్లు అమీతుమీ తేల్చుకోనున్నాయి. ఈ మ్యాచ్లో టాస్ గెలిచిన సన్రైజర్స్ కెప్టెన్ డేవిడ్ వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఐపీఎల్ 2020లో ఇప్పటివరకు ఏడు మ్యాచులు జరగగా.. టాస్ గెలిచిన కెప్టెన్ బౌలింగ్ ఎంచుకున్నారు. మొదటిసారిగా వార్నర్ బ్యాటింగ్ ఎంచుకున్నాడు. ఈ మ్యాచ్ కోసం వార్నర్ మూడు మార్పులు చేశాడు. మిచెల్ మార్ష్ స్థానంలో మహ్మద్ నబీ జట్టులోకి వచ్చాడు. మరోవైపు దినేష్ కార్తీక్ తుది జట్టులో రెండు మార్పులు చేశాడు.
ఈ సీజన్లో హైదరాబాద్, కోల్కతాకు ఇది రెండో మ్యాచ్. రెండు జట్లు కూడా టోర్నీలో ఆడిన తొలి మ్యాచ్లోనే ఓటమిని ఎదుర్కొన్నాయి. తొలి మ్యాచ్లో డేవిడ్ వార్నర్ సేన విరాట్ కోహ్లీ సారథ్యంలోని రాయల్ చాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) చేతిలో ఓడిపోగా.. దినేశ్ కార్తీక్ సారథ్యంలోని కోల్కతా తొలి మ్యాచ్లో ముంబై ఇండియన్స్ చేతిలో పరాజయం పాలైంది. ఈ నేపథ్యంలో లీగ్లో బోణీ చేయాలని ఇరు జట్లు భావిస్తున్నాయి. మరి గెలుపు ఏ జట్టును వరిస్తుందో..? చూడాలి.
అబుదాబి పిచ్ స్పిన్కు అనుకూలం. మంచు ప్రభావం ఉంటుంది. ఓపికగా క్రీజులో కుదురుకుంటే భారీ స్కోర్స్ చేయవచ్చు. గత రెండు మ్యాచ్ల్లో రోహిత్ శర్మ, కేఎల్ రాహుల్ అలానే సక్సెస్ అయ్యారు. రాత్రి 7.30 గంటలకు మ్యాచ్ ప్రారంభం కానుండగా.. స్టార్ స్పోర్ట్స్ చానెల్స్, డిస్నీ హాట్స్టార్లో ప్రత్యక్ష ప్రసారం కానుంది. ఇక ఐపీఎల్ చరిత్రలో ఇరు జట్లు ఇప్పటి వరకు 17 సార్లు తలపడగా.. 10-7తో కోల్కతా లీడ్లో ఉంది. ఇదే ఆధిపత్యాన్ని కొనసాగించాలని కేకేఆర్ భావిస్తుండగా.. గెలుపుతో లెక్కలను సరిచేయాలని ఆరెంజ్ ఆర్మీ ఆత్మవిశ్వాసంతో బరిలోకి దిగుతుంది.
తుది జట్లు:
కోల్కతా నైట్ రైడర్స్: సునీల్ నరైన్, శుభమన్ గిల్, దినేశ్ కార్తీక్ (కీపర్, కెప్టెన్), నితీష్ రాణా, ఇయాన్ మోర్గాన్, ఆండ్రీ రస్సెల్, ప్యాట్ కమిన్స్, కమలేష్ నాగర్కోటి, వరుణ్ చక్రవర్తి, కుల్దీప్ యాదవ్, శివమ్ మావి.
సన్ రైజర్స్ హైదరాబాద్: జానీ బెయిర్స్టో (కీపర్), డేవిడ్ వార్నర్ (కెప్టెన్), మనీష్ పాండే, ప్రియమ్ గార్గ్, మహ్మద్ నబీ, వృద్దిమాన్ సాహా, అభిషేక్ శర్మ, రషీద్ ఖాన్, భువనేశ్వర్ కుమార్, టీ నటరాజన్, ఖలీల్ అహ్మద్.