
అభిమానులతో ఐపీఎల్ ముందే ఇంటరాక్ట్ అవడం కోసం రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ) ప్రత్యేకంగా ఈవెంట్ నిర్వహించింది. ఈ విషయం మర్చిపోయేలోపే మరో ఫ్రాంచైజీ కూడా భారీ ప్రోగ్రాం కోసం ఏర్పాట్లు చేస్తోందని తెలుస్తోంది. అదే కోల్కతా నైట్ రైడర్స్. ఈ జట్టు కెప్టెన్ శ్రేయాస్ అయ్యర్ వెన్నునొప్పితో బాధ పడుతున్న సంగతి తెలిసిందే. ఈ నొప్పి కారణంగా అతను ఐపీఎల్కు కూడా దూరమయ్యేలా ఉంది పరిస్థితి. దీంతో ఆ జట్టుకు కొత్త కెప్టెన్ అవసరం ఏర్పడింది.
అయ్యర్ వెన్నునొప్పికి సర్జరీ అవసరం అని వైద్యులు చెప్తున్నారట. దీంతో అతను కనుక సర్జరీ చేయించుకుంటే కనీసం ఆరేడు నెలలు ఆటకు దూరమయ్యే అవకాశం ఉంది. అప్పుడు కేవలం ఐపీఎల్ మాత్రమే కాదు. డబ్ల్యూటీసీ ఫైనల్ కూడా అతను ఆడటం జరగదు. ఈ ఏడాది చివర్లో జరిగే వన్డే వరల్డ్ కప్లో ఆడటం కూడా అనుమానమే. ఈ క్రమంలోనే అయ్యర్ సర్జరీకి దూరంగా ఉండాలని అనుకుంటున్నట్లు కూడా వార్తలు వచ్చాయి.
ఏదేమైనా అయ్యర్ ఈ ఏడాది ఐపీఎల్ మొత్తం ఆడటం మాత్రం జరిగేలా లేదు. సర్జరీ చేయించుకుంటే పూర్తిగా ఐపీఎల్కు దూరం అవుతాడు. లేదంటే తొలి సగం మ్యాచుల్లో ఆడటం కుదరదు. ఈ క్రమంలోనే కేకేఆర్ కొత్త కెప్టెన్గా ఎవర్ని నియమించాలని ఆ ఫ్రాంచైజీ తెగ ఆలోచిస్తోంది. టీమిండియా ఆల్రౌండర్ శార్దూల్ ఠాకూర్, విండీస్ ప్లేయర్లు సునీల్ నరైన్, ఆండ్రీ రస్సెల్ పేర్లను కేకేఆర్ యాజమాన్యం పరిగణనలోకి తీసుకుందని వార్తలు వినిపిస్తున్నాయి.
ఈ క్రమంలో తమ జట్టు కొత్త కెప్టెన్ ఎవరో ప్రకటించేందుకు కేకేఆర్ ఒక భారీ ఈవెంట్ ప్లాన్ చేస్తోందని తెలుస్తోంది. ఈ కార్యక్రమంలోనే కేకేఆర్ కొత్త కెప్టెన్ పేరును ప్రకటిస్తారట. ఈ వేడుకలకు కేకేఆర్ యజమాని, బాలీవుడ్ బాద్షా షారుఖ్ ఖాన్ కూడా హాజరవుతారని వార్తలు వినిపిస్తున్నాయి. చాలా కాలం గ్యాప్ తర్వాత మళ్లీ హోం, ఎవే ఫార్మాట్లో ఐపీఎల్ జరుగుతోంది. దీంతో అభిమానులు కూడా తమ ఫేవరెట్ టీమ్స్ను వాళ్ల హోం గ్రౌండ్లో చూసేందుకు ఉత్సాహం చూపుతున్నారు.