హైదరాబాద్: క్రిస్ లిన్... కోల్కతా నైట్ రైడర్స్ జట్టు తరుపున ఆడిన తొలి మ్యాచ్లోనే (41 బంతుల్లో 93 నాటౌట్, 6 ఫోర్లు, 8 సిక్సులతో) మెరుపు ఇన్నింగ్స్ ఆడి అందర్నీ ఆశ్చర్యపరిచాడు. ఎలాంటి బంతినైనా అలవోకగా స్టాండ్స్లోకి పంపే సత్తా ఉన్న ఈ హిట్టర్ని దురదృష్టం వెంటాడింది.
ముంబై ఇండియన్స్తో ఆదివారం రాత్రి జరిగిన రెండో మ్యాచ్లో ఫీల్డింగ్ చేస్తూ గాయపడ్డాడు. మ్యాచ్లో ముంబై బ్యాట్స్ మెన్ జోస్ బట్లర్ క్యాచ్ కోసం ప్రయత్నిస్తూ లిన్ పట్టుజారి పడిపోవడంతో భుజానికి గాయమైంది. కాసేపు నొప్పితో విలవిలలాడిన లిన్ అనంతరం ఫిజియో సలహాతో మైదానాన్ని వీడాడు.
మ్యాచ్ అనంతరం గాయం తీవ్రత దృష్ట్యా క్రిస్ లిన్ ఐపీఎల్ టోర్నీకే దూరమయ్యే సూచనలు కనిపిస్తున్నాయి. ఈ మేరకు క్రిస్ లిన్ తన ట్విట్టర్లో చేసిన ట్వీట్ అనుమానికి తావిస్తోంది. గత రెండేళ్లలో లిన్ ఇలా భుజం గాయంతో క్రికెట్కి దూరమవడం ఇది మూడోసారి.

ఇప్పటివరకు రెండు ఐపీఎల్ మ్యాచ్లాడిన క్రిస్ లిన్ 125 పరుగులతో ఐపీఎల్ టాప్ స్కోరర్గా ఉన్నాడు. అయితే క్రిస్ లిన్ గాయంపై కోల్కతా ప్రాంఛైజీ అధికారిక ప్రకటన చేయలేదు. ఇదిలా ఉంటే ఆసీస్ తరుపున ఒక వన్డే, 5 టీ20 మ్యాచ్లు ఆడాడు.
ఐపీఎల్లో సత్తాచాటడం ద్వారా ఆస్ట్రేలియా జట్టులో సుస్థిర స్థానం సంపాదించుకోవాలని భావిస్తున్న సమయంలో ఇలా అర్ధాంతరంగా గాయంతో ఆ అవకాశాన్ని చేజార్చుకోవడంతో లిన్ తన ట్విట్టర్ ఖాతాలో ఆవేదనను వ్యక్తం చేశాడు.
'దేవుడా నేను ఏమి తప్పు చేశాను. ఎందుకు నన్ను క్రికెట్కి దూరం చేస్తున్నావు' అంటూ ట్వీట్ చేశాడు. మ్యాచ్ అనంతరం గంభీర్ మాట్లాడుతూ 'లిన్ గాయంపై ఇంకా పూర్తి స్థాయిలో స్పష్టత రాలేదు' అని వ్యాఖ్యానించాడు.