అంచనాలకు తగ్గట్లుగానే భారత పర్యటనకు వచ్చిన బంగ్లాదేశ్ టెస్టు సిరీస్ను 0-2తో కోల్పోయింది. పాకిస్థాన్ను ఓడించిన రెట్టింపు ఉత్సాహంతో టీమిండియాతో టెస్టు సిరీస్కు బరిలోకి దిగిన బంగ్లా పేలవమైన ప్రదర్శన చేసింది. ఇక పర్యటనలో భాగంగా ఆదివారం నుంచి మూడు టీ20ల సిరీస్ ఆడనుంది. బంగ్లాదేశ్ బలమైన ప్రత్యర్థి కాకపోవడంతో టీ20 సిరీస్పై భారీ అంచనాలేమి లేవు.
అయితే భారత తుది జట్టుపై మాత్రం సర్వత్రా ఆసక్తి నెలకొంది. జట్టు కూర్పు ఎలా ఉంటుందని చర్చ మొదలైంది. అయితే ఇది భారత్ వర్సెస్ బంగ్లాదేశ్ టీ20 సిరీస్ కోసం కాదు. ఐపీఎల్ రిటెన్షన్ నిబంధనలతోనూ ముడిపడి ఉంది.
నితీశ్ కుమార్ రెడ్డి, మయాంక్ యాదవ్, హర్షిత్ రాణా తుదిజట్టులో చోటు దక్కించుకుంటారా లేదా అనే ఉత్కంఠ మొదలైంది. ఈ ముగ్గరు తుదిజట్టులో సెలక్ట్ అయితే సన్రైజర్స్ హైదరాబాద్, లక్నో సూపర్ జెయింట్స్, కోల్కతా నైట్ రైడర్స్కు ఆర్థికంగా దెబ్బపడినట్లే.

ఎలా అంటే అన్క్యాప్డ్ ప్లేయర్లుగా నితీశ్ను ఎస్ఆర్హెచ్, మయాంక్ను లక్నో, హర్షిత్ను కేకేఆర్ రిటైన్ చేసుకోవాలని భావిస్తుంది. ఇలా జరిగితే ఈ ఆటగాళ్లకు ఒక్కొక్కరికి వాళ్ల ఫ్రాంచైజీలు రూ.4 కోట్లు చెల్లిస్తే సరిపోతుంది. కానీ తుదిజట్టులో చోటు దక్కించుకుంటే మాత్రం రిటెన్షన్ రూల్స్ ప్రకారం కనీసం రూ.11 కోట్లు చెల్లించి వాళ్లను అట్టిపెట్టుకోవాల్సి ఉంటుంది. లేదంటే వేలంలో ఆర్టీఎమ్ కార్డ్ ద్వారా దక్కించుకోవాల్సి ఉంటుంది. ఈ రెండు ప్రక్రియలు ఫ్రాంచైజీల పర్స్ను ఖాళీ చేస్తుంది.
రిటెన్షన్ లిస్ట్ను ఐపీఎల్ నిర్వాహకులకు అందించడానికి ఫ్రాంచైజీలకు అక్టోబర్ 31 వరకే గడువు. అయితే ఈ సమయంలోపు బంగ్లాదేశ్తో టీ20 సిరీస్, న్యూజిలాండ్తో టెస్టు సిరీస్ను టీమిండియా ఆడనుంది. నితీశ్, హర్షిత్, మయాంక్ ఇప్పట్లో టెస్టు జట్టులో చోటు దక్కించుకోవడం దాదాపు అసాధ్యమే. దీంతో బంగ్లాదేశ్తో టీ20 సిరీస్లో తుదిజట్టులో చోటు దక్కకపోతే తమకు కలిసొస్తుందని ఫ్రాంచైజీలు భావిస్తున్నాయి.

ఈ నేపథ్యంలో టీమిండియా ప్రధాన కోచ్ గౌతమ్ గంభీర్తో సంబంధింత ఫ్రాంచైజీలు.. ఈ కుర్రాళ్లకు బంగ్లాతో టీ20 సిరీస్లో తుదిజట్టులో ఛాన్స్ ఇవ్వకుండా ఉండేలా చూడమని అడగడానికి సిద్ధమవుతున్నాయని తెలుస్తోంది. గంభీర్ ముక్కుసూటి మనిషి కావడంతో నేరుగా కాకుండా చనువుగా మంతనాలు జరపాలని నిర్ణయించుకున్నట్లు తెలుస్తోంది. గతంలో లక్నో, కోల్కతా ఫ్రాంచైజీలతో గంభీర్ కలిసి పనిచేసిన సంగతి తెలిసిందే. 2022, 2023 సీజన్లలో లక్నోకు మెంటార్గా, 2024 సీజన్లో కేకేఆర్ మెంటార్గా గంభీర్ విధులు నిర్వర్తించాడు. కాగా, గంభీర్ తుదిజట్టు నిర్ణయమే ఎస్ఆర్హెచ్, లక్నో, కేకేఆర్ ఫ్రాంచైజీల పర్స్లో మిగులు నిధులను నిర్ణయించనుంది.