చెన్నై: కరోనా వైరస్ మహమ్మారి నుంచి కోలుకున్నా.. తాను ఇంకా బలహీనంగానే ఉన్నానని కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) మిస్టరీ స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి తెలిపాడు. కరోనా నెగిటివ్ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదని.. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా అని చెప్పాడు. వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడిన తర్వాతే ఐపీఎల్ 2021 బయో బుడగలో ఉన్న ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. పలు జట్లలో వైరస్ కేసులు నమోదవడంతో బీసీసీఐ టోర్నీని నిరవధిక వాయిదా వేసింది.
తాజాగా వరుణ్ చక్రవర్తి మాట్లాడుతూ... 'ప్రస్తుతం నేను ఇంట్లో ఉంటూ కోలుకుంటున్నా. శారీరకంగా బలహీనంగా ఉండటంతో ప్రాక్టీస్ చేయడం లేదు. కరోనా నెగిటివ్ వచ్చినా ఇంకా ఆ లక్షణాలు పోలేదు. అప్పుడప్పుడు రుచీ, వాసన కోల్పోతున్నా. కానీ త్వరలోనే ట్రైనింగ్ ప్రారంభిస్తా' అని ధీమా వ్యక్తం చేశాడు. ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలో వైరస్ బారిన పడిన కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకుని ఇటీవలే ఇంటికి చేరుకున్నారు. సందీప్ వైరస్ నుంచి త్వరగానే బయటపడినా.. వరుణ్కి మాత్రం కాస్త సమయం పట్టింది.
వైరస్ బాధితులకు వరుణ్ చక్రవర్తి పలు సూచనలు చేశాడు. 'కరోనా నుంచి కోలుకున్నా.. కనీసం రెండు వారాలు విశ్రాంతి తీసుకోవాలి. అది క్రీడాకారులైనా, మరెవరైనా కావచ్చు. మీకు నెగిటివ్ వచ్చినా కచ్చితంగా మాస్క్ ధరించండి. అది మీ చుట్టూ ఉండేవాళ్లకు రక్షణగా ఉంటుంది. అలాగే వైరస్ బారిన పడినప్పుడు దేని గురించీ ఆలోచించొద్దు. అనవసర విషయాలు అసలు పట్టించుకోకపోవడం మంచిది. ముఖ్యంగా బయటి విషయాలను ఏమాత్రం పట్టించుకోవద్దు' అని వరుణ్ సూచించాడు.
'మే 1న కాస్త ఇబ్బందిగా అనిపించడంతో పాటు తేలికపాటి జ్వరం వచ్చింది. వెంటనే జట్టు యాజమాన్యానికి విషయం చెప్పి.. ట్రైనింగ్ సెషన్కు వెళ్లలేదు. ఆటగాళ్లందరికీ దూరంగా ఉన్నా. ఆర్టీ-పీసీఆర్ పరీక్షల్లో పాజిటివ్గా తేలడంతో కంగారుపడ్డా. నా గురించే కాకుండా దేశంలో ఏం జరుగుతుందనే విషయాలపై ఆందోళన చెందా. కానీ ఒక ఆటగాడిగా త్వరగా కోలుకోవాలనే మార్గాలను అన్వేషించా. మా ఫ్రాంఛైజీ కూడా ఎంతో అండగా నిలిచింది. ఐపీఎల్ వాయిదా పడ్డా నాతో ఒకరిని తోడుగా ఉంచింది. రెండు సార్లు నెగిటివ్ ఫలితం వచ్చాకే ఇంటికి పంపించారు. ఆ సమయంలో షారుఖ్ ఖాన్ ఆటగాళ్లందరితో ప్రత్యేకంగా మాట్లాడి ధైర్యం చెప్పారు' అని వరుణ్ వివరించాడు.