కోల్కతా: రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు (ఆర్సీబీ), కోల్కతా నైట్ రైడర్స్ (కేకేఆర్) జట్ల మధ్య రెండు రోజుల క్రితం స్వల్ప ఘర్షణ చోటు చేసుకుందా? అంటే అవుననే వాదనలు వినిపిస్తున్నాయి. ఐపీఎల్ 8లో భాగంగా శనివారం నాడు ఆర్సీబీ, బెంగళూరు మధ్య మ్యాచ్ జరిగింది.
ఈ మ్యాచ్లో క్రిస్ గేల్ 56 బంతుల్లో 96 పరుగులు చేసి ఆర్సీబీని ఒంటిచేత్తో గెలిపించాడు. ఇదిలా ఉండగా, ఇరు జట్ల మధ్య స్వల్ప ఘర్షణ చోటు చేసుకున్నట్లుగా మీడియాలో వార్తలు వస్తున్నాయి.

మీడియాలో వస్తున్న వార్తల మేరకు.. మ్యాచ్ అనంతరం ఆర్సీబీకి చెందిన ఓ క్రికెటర్ కాలర్ను కేకేఆర్ ఆటగాడు పట్టుకున్నారని తెలుస్తోంది.
ఈ ఘటన అనంతరం ఆటగాళ్లు, అఫీషియల్స్ ఆ రోజు రాత్రి మ్యాచ్ రిఫరీ ముందు హాజరయ్యారని టీవీ ఛానల్స్ రిపోర్ట్స్ ద్వారా తెలుస్తోంది. వారి వాదనలు అర్ధరాత్రి 1.30 గంటల వరకు సాగాయాని తెలుస్తోంది. 2013లో కేకేఆర్ కెప్టెన్ గౌతమ్ గంభీర్, ఆర్సీబీ కెప్టెన్ విరాట్ కోహ్లీల మధ్య వాగ్వాదం చోటు చేసుకున్న విషయం తెలిసిందే.