న్యూఢిల్లీ: టీమిండియా వికెట్ కీపర్, బ్యాట్స్మన్ దినేశ్ కార్తీక్ భారత క్రికెట్ నియంత్రణ మండలి (బీసీసీఐ)కి బేషరుతుగా క్షమాపణలు చెప్పాడు. ఐపీఎల్లో కోల్కతా నైట్రైడర్స్ కోచ్ బ్రెండన్ మెక్కలమ్ అభ్యర్థన మేరకే విండీస్కి వెళ్లానని, మ్యాచ్ను వీక్షించాలని అతను కోరడంతో డ్రెస్సింగ్ రూంలో కూర్చున్నా అని కార్తీక్ వెల్లడించాడు. భవిష్యత్తులో ఇలాంటి పొరపాట్లు జరగకుండా చూసుకుంటానని హామీ కూడా ఇచ్చాడు.
దక్షిణాఫ్రికా-ఏతో సిరీస్.. మ్యాచ్ ఫీజును విరాళంగా ఇచ్చిన సంజు శాంసన్!!
మెక్కలమ్ అభ్యర్థన మేరకు వెస్టిండీస్ వేదికగా జరుగుతున్న కరీబియన్ ప్రీమియర్ లీగ్ (సీపీఎల్)కి దినేశ్ కార్తీక్ హాజరయ్యాడు. బాలీవుడ్ హీరో షారూక్ ఖాన్కి చెందిన ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్టు ప్రమోషనల్ కార్యక్రమంలో పాల్గొన్నాడు. అంతేకాదు మ్యాచ్ని డ్రెస్సింగ్ రూములో కూర్చుని వీక్షించాడు. ట్రిన్బాగో జెర్సీ ధరించి దినేశ్ కార్తీక్ మ్యాచ్ని చూస్తున్న ఫొటోలు సోషల్ మీడియాలో వైరల్ అవ్వడంతో.. ఆగ్రహించిన బీసీసీఐ సీఈవో రాహుల్ జోహ్రీ షోకాజ్ నోటీసులు జారీ చేశాడు. బీసీసీఐ నిబంధనలు ఉల్లంఘించిన కారణంగా నీపై చర్యలు ఎందుకు తీసుకోకూడదో వివరణ ఇవ్వాలని అందులో పేర్కొన్నాడు.
దీనిపై కార్తీక్ క్షమాపణలు చెప్పాడు. 'బీసీసీఐ అనుమతి లేకుండా సీపీఎల్కి వెళ్లడం పొరపాటే. అందుకు బేషరుతుగా క్షమాపణలు కోరుతున్నా. ట్రిన్బాగో నైట్రైడర్స్ జట్టుకి సంబంధించి ఎలాంటి విషయాల్లో జోక్యం చేసుకోను. ఇకపై వారి డ్రెస్సింగ్ రూంకి వెళ్లి మ్యాచ్లు చూడను' అని లేఖలో కార్తీక్ పేర్కొన్నాడు. ట్రిన్బాగో జట్టు షారుక్ ఖాన్ది కావడం.. అతని యాజమాన్యంలోని కోల్కతా నైట్రైడర్స్కు ఐపీఎల్లో దినేశ్ కార్తీక్ సారథిగా వ్యవహరిస్తుండటం తెలిసిందే. బోర్డు కాంట్రాక్టు ఆటగాడు అయిన కార్తీక్.. ఐపీఎల్ మినహా ఇతర లీగుల్లో ఆడే అవకాశం లేదు.