కోల్కతా: ఇండియన్ ప్రీమియర్ లీగ్ (ఐపీఎల్) ప్రాంచైజ్ కోల్కతా నైట్ రైడర్స్ అభిమానులకు శుభవార్త. ఐపీఎల్ 2021 జరుగుతున్న సమయంలో కరోనా వైరస్ మహమ్మారి బారిన పడిన కోల్కతా బౌలర్లు వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ 10 రోజుల ఐసోలేషన్ పూర్తి చేసుకుని ఇంటికి చేరుకున్నారు. ఈ విషయాన్ని భారత క్రికెట్ మండలి (బీసీసీఐ) అధికారి ఒకరు ధ్రువీకరించారు. సందీప్ ఆరోగ్యంగానే ఉన్నాడని, వరుణ్కి కాస్త జ్వరంగా ఉందని ఆ ధికారి తెలిపారు. ఇంటికి వెళ్లినా ఇద్దరి ఆరోగ్య పరిస్థితిని బీసీసీఐ నిత్యం పర్యవేక్షిస్తూనే ఉంటుందని కూడా చెప్పారు.
'వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ ఇంటికి చేరుకున్నారు. ఇద్దరు నిబంధనల ప్రకారం 10 రోజుల క్వారంటైన్ పూర్తి చేసుకున్నారు. అయిన్పటికీ కోల్కతా నైట్ రైడర్స్ యాజమాన్యం వీరి ఆరోగ్య పరిస్థితిని పర్యవేక్షిస్తూనే ఉంటుంది. వరుణ్ చక్రవర్తి చెన్నైలో, సందీప్ వారియర్ కేరళలో ఆర్టీపీసీఆర్ పరీక్షలు చేయించుకోనున్నారు. ప్రస్తుతం సందీప్ ఆరోగ్యంగానే ఉన్నాడు. జ్వరం, ఇతర లక్షణాలేవీ లేవు. వరుణ్కి మాత్రం కాస్త జ్వరంగా ఉంది. కానీ నిన్నటి కంటే మెరుగ్గా ఉన్నాడు. ఇద్దరూ ఉత్సాహాంగా ఉన్నారు' అని బీసీసీఐ అధికారి తెలిపారు.
COVID-19 vaccine: మొదలెట్టిన గబ్బర్.. కరోనా టీకా కోసం క్యూ కడుతున్న టీమిండియా ప్లేయర్స్!
వరుణ్ చక్రవర్తి, సందీప్ వారియర్ కరోనా బారిన పడిన తర్వాతే ఐపీఎల్ 2021 బయో బుడగలో ఉన్న ఇతర ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి వైరస్ సోకిన సంగతి తెలిసిందే. మొదటగా కోల్కతా బౌలర్లు అయిన వరుణ్, సందీప్కు పాజిటీవ్ రాగా.. ఆ తర్వాత ఢిల్లీ క్యాపిటల్స్ వెటరన్ స్పిన్నర్ అమిత్ మిశ్రా, హైదరాబాద్ సీనియర్ కీపర్ వృద్దిమాన్ సాహా, చెన్నై కోచ్లు లక్ష్మీపతి బాలాజీ, మైఖేల్ హస్సిలు మహమ్మారి బారిన పడ్డారు. దాంతో ఆటగాళ్ల సంరక్షణను దృష్టిలో ఉంచుకొని బీసీసీఐ లీగ్ను గత మంగళవారం నిరవధికంగా వాయిదా వేసింది. దీంతో ఆసీస్ ఆటగాళ్లు మినహా అందరూ ఇళ్లకు చేరుకున్నారు.
ఐపీఎల్ 2021లో మొత్తం 60 మ్యాచ్లకు గాను.. మంగళవారం లీగ్ ఆగిపోయేసమయానికి 29 మ్యాచులే పూర్తయ్యాయి. ఒకవేళ ఐపీఎల్ 2021లోని మిగతా మ్యాచులు జరగకపోతే.. బీసీసీఐ 2500 కోట్లు నష్టపోనుందని స్వయంగా బీసీసీఐ అధ్యక్షుడు సౌరవ్ గంగూలీనే తెలిపారు. ఈ నేపథ్యంలో సీజన్ను తిరిగి నిర్వహించే సమయం, వేదిక గురించి బీసీసీఐ యోచిస్తోంది. అక్టోబర్లో టీ20 ప్రపంచకప్నకు బీసీసీఐ ఆతిథ్యమివ్వాల్సి ఉంది. కావున అంతకంటే ముందే సెప్టెంబర్లో మిగిలిన సీజన్ను నిర్వహించే వీలుంది. అయితే అప్పుడు కూడా దేశంలో కరోనా ఉద్ధృతి కొనసాగితే.. లీగ్తో పాటు టీ20 ప్రపంచకప్నూ ఇక్కడి నుంచి తరలించక తప్పని పరిస్థితి ఎదురుకానుంది. ఐపీఎల్ 2021 మిగతా సీజన్ నిర్వహణ కోసం యూఏఈ, ఇంగ్లండ్, ఆస్ట్రేలియా, శ్రీలంక పోటీపడుతున్నాయి.